అక్షరటుడే, బాన్సువాడ: Government Schools| ప్రభుత్వ పాఠశాలల్లో భద్రత ప్రశ్నార్థకంగా మారింది. ప్రహరీల్లేని పాఠశాలలను దొంగలు టార్గెట్ చేస్తున్నారు. విలువైన సామాగ్రి ఉన్న గదులను పగులగొట్టి వాటిని ఎత్తుకెళ్తున్నారు. జిల్లా వాప్తంగా స్కూళ్లకు రక్షణ వ్యవస్థ లేకపోవడంతో యథేచ్ఛగా చోరీలు జరుగుతున్నాయి.
ప్రహరీల్లేని పాఠశాలలు..
చాలావరకు ప్రభుత్వ పాఠశాలలకు ప్రహరీలు లేవు. దీంతో రాత్రయితే దొంగలు యథేచ్ఛగా చోరీలకు పాల్పడుతున్నారు. ఆకతాయిలు సైతం ప్రభుత్వ బడులను అసాంఘిక కార్యకలాపాలకు (Anti-social activities) అడ్డాలుగా మార్చేశారు. దీంతో పాఠశాల సిబ్బందికి ఇబ్బందులు తప్పడం లేదు. చోరీకి గురైతే వస్తువులను సమకూర్చుకోవడం స్కూల్ ఇన్ఛార్జీలకు ఇబ్బందికరంగా మారుతోంది. పాఠశాలలకు వచ్చే తక్కువ గ్రాంట్తో నిర్వహణ ఖర్చుకు అవస్థలు పడుతుంటే అపహరణకు గురైన వస్తువులు కొనేందుకు ఖర్చు మరింత పెరుగుతుంది.
జిల్లావ్యాప్తంగా..
జిల్లావ్యాప్తంగా 1,115 ప్రభుత్వ పాఠశాలున్నాయి. 183 ఉన్నత పాఠశాలలున్నాయి. జూన్ 11 వరకు పాఠశాలలకు వేసవి సెలవులున్నాయి. ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలకు తాళాలు వేయించారు. దొంగతనాలు జరిగే ఆస్కారం ఉన్నప్పటికీ రక్షణ లేని పరిస్థితి నెలకొంది. వర్ని మండలం చింతల్ పేట్ తండాలో ఫిబ్రవరిలో ప్రాథమిక పాఠశాల తలుపులు ధ్వంసం చేశారు. బీరువాను పగులగొట్టి దుండగులు చోరీకి యత్నించారు. టీవీ, ఫర్నిచర్ను పగులగొట్టారు. ఇలా పలు పాఠశాలల్లో రక్షణ వ్యవస్థ లేక దొంగతనాలు జరుగుతున్నాయి.
విలువైన సామాగ్రి అపహరణ..
ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్లు, ఆర్వో ప్లాంట్లు, ఫ్యాన్లు, వంట సామాగ్రి ఉంటాయి. అమ్మ ఆదర్శ కమిటీలు (Amma AdarshaCommittees) పాఠశాలలపై దృష్టి సారించేలా అవగాహన కల్పించాలని గ్రామస్థులు కోరుతున్నారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలతో పాఠశాలలకు భద్రత ఏర్పాటు చేయిస్తే చోరీలకు అడ్డుకట్ట పడే అవకాశం ఉంటుందని ప్రజలు పేర్కొంటున్నారు.