అక్షరటుడే, వెబ్డెస్క్ : Railway Passengers | పెద్దపల్లి జిల్లాలో పెద్ద ప్రమాదం తప్పింది. నిర్మాణంలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జి క్లస్టర్(Railway Overbridge Cluster) విరిగిపోయింది. అయితే అది పట్టాలపై పడి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగేది. కానీ సిబ్బంది ముందుగానే గుర్తించడంతో రైళ్ల రాకపోకలను నిలిపివేసి మరమ్మతులు చేస్తున్నారు.
పెద్దపల్లి రైల్వే జంక్షన్(Peddapalli Railway Junction) సమీపంలో కూనారం వద్ద ఆర్వోబీ నిర్మిస్తున్నారు. రూ.119.50 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ వంతెన పనులు నత్తనడకన సాగుతున్నాయి. వేసవి లోపు పనులు పూర్తి చేయాలని గతంలో కలెక్టర్ ఆదేశించిన ఇంకా పూర్తి కాలేదు. అయితే ప్రస్తుతం పనులు చేపడుతున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం వంతెన నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన క్లస్టర్ విరిగిపోయింది. ఈ క్లస్టర్ పూర్తిగా విరిగి గడ్డర్లు రైలు పట్టాలపై(Train Tracks) పడితే పెద్ద ప్రమాదం జరిగేది. అయితే ముందుగానే గుర్తించిన అధికారులు దానికి మరమ్మతులు చేస్తున్నారు.
Railway Passengers | రైళ్ల రాకపోకలకు అంతరాయం
క్లస్టర్ మరమ్మతుల కారణంగా అధికారులు ముందు జాగ్రత్తగా పలు రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. కాజీపేట నుంచి బల్లార్షా, బల్లార్షా నుంచి కాజీపేట వైపు నడిచే రైళ్లను ఆపేశారు. దీంతో ఆయా స్టేషన్లలో గంటల తరబడి రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. కొలనూర్ రైల్వే స్టేషన్(Kolanur Railway Station) లో 22631 అనువ్రత్ ఏసీ సూపర్ ఫాస్ట్, పోత్కపల్లిలో 20805 పి సూపర్ ఫాస్ట్, బిసుగిరి షరీఫ్ రైల్వే స్టేషన్లో 12621 తమిళనాడు సూపర్ ఫాస్ట్, జమ్మికుంట రైల్వే స్టేషన్లో 12723 తెలంగాణ సూపర్ ఫాస్ట్, 22691 బెంగళూరు రాజధాని సూపర్ ఫాస్ట్, ఉప్పల్ రైల్వే స్టేషన్లో 17011 కాగజ్ నగర్ ఇంటర్ సిటీ, హసన్ పర్తి రైల్వే స్టేషన్లో 22648 కోర్బా బై వీక్లీ సూపర్ ఫాస్ట్, రామగుండం రైల్వే స్టేషన్లో 20101 వందే భారత్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైళ్లను అధికారులు నిలిపివేశారు. మరమ్మతులు పూర్తయ్యాక ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు అనుమతించనున్నారు.
సిర్పూర్ వైపు వెళ్ళే రామగిరి మెము 17003 ఎక్స్ ప్రెస్ పుష్ పుల్ రైలును ఓదెల రైల్వే స్టేషన్ లో గత 4 గంటలుగా నిలిపారు.ఈ కారణంగా ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.