అక్షరటుడే, వెబ్డెస్క్: CM Convoy | పెట్రోల్ బంకుల్లో(Petrol Bunks) జరిగే మోసాలు మనం నిత్యం చూస్తూనే ఉంటాం. చాలా బంకుల్లో చిప్లు అమర్చి పెట్రోలు, డీజిల్ తక్కువగా కొడతారు. అలాగే పలు బంకుల్లో ఇంధనంతో పాటు నీళ్లు కలిసి వస్తుంటాయి. ఇలాంటి ఘటనలు తరుచూ చోటు చేసుకుంటాయి. అలాంటి సమయంలో వాహనదారులు ఆందోళన చేపట్టినా అధికారులు తూతూ మంత్రంగా చర్యలు చేపట్టి వదిలేస్తారు. అయితే తాజాగా ముఖ్యమంత్రి కాన్వాయ్(Chief Minister Convoy)లోని కార్లలో డీజిల్కు బదులు నీళ్లు నింపారు. దీంతో ఆ వాహనాలు ఆగిపోయాయి.
మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్(Madhya Pradesh CM Mohan Yadav) శుక్రవారం రత్లాంలో జరిగే ఎంపీ సదస్సుకు హాజరు కావాల్సి ఉంది. దీనికోసం గురువారం రాత్రి ఓ బంక్లో ఆయన కాన్వాయ్లోని 19 కార్లలో డీజిల్(Diesel) కొట్టించారు. వాహనాలు కొద్ది దూరం వెళ్లగానే ఆగిపోయాయి. దీంతో అధికారులు ఆందోళన చెందారు. వాహనాల ట్యాంకులను తెరిచి తనిఖీ చేయగా.. డీజిల్లో నీరు కలిసినట్లు గమనించారు. తర్వాత ఆ వాహనాలను రోడ్డు పక్కకు నెట్టుకుంటూ వెళ్లారు.
CM Convoy | బంక్కు సీల్
అడ్మినిస్ట్రేటివ్ అధికారులు(Administrative officers) రాత్రి ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంధనంలో నీరు కలవడంతో సదరు పెట్రోల్ బంక్కు సీల్ వేశారు. అనంతరం ఇతర వాహనాలను సీఎం కాన్వాయ్ కోసం ఏర్పాటు చేశారు. డిప్యూటీ తహశీల్దార్ ఆశిష్ ఉపాధ్యాయ్(Deputy Tehsildar Ashish Upadhyay), ఆహార సరఫరా అధికారి మరియు ఇతర అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. వాహనంలో 20 లీటర్ల డీజిల్ నింపినప్పుడు 10 లీటర్ల నీరు బయటకు వచ్చినట్లు గుర్తించారు. అన్ని వాహనాలలోనూ ఇదే పరిస్థితి కనిపించింది. అదే సమయంలో ఒక ట్రక్కులో కూడా 200 లీటర్ల డీజిల్ నింపారు. అది కూడా కొద్ది దూరం వెళ్లగానే ఆగిపోయింది. దీంతో అధికారులు బంక్ మేనేజర్(Bunk Manager)కు ఫోన్ చేయగా.. వర్షానికి డీజిల్ ట్యాంక్లోకి నీరు చేరి ఉంటుందని ఆయన చెప్పారు. దీంతో అధికారులు సదరు పెట్రోల్ బంక్ను సీజ్ చేశారు.