అక్షరటుడే, వెబ్డెస్క్ :Karnataka | కర్ణాటక – కేరళ సరిహద్దులోని మలై మహదేవేశ్వర వన్యప్రాణి విభాగం (Malai Mahadeshwara Wildlife Division)లో వన్యప్రాణి ప్రేమికులను కలిచివేసే ఘటన చోటుచేసుకుంది. అక్కడ ఒక తల్లి పులి, నాలుగు పిల్లలు విషప్రయోగం(Poisoning) కారణంగా మృతి చెందినట్లు అటవీ శాఖ ప్రాథమికంగా నిర్ధారించింది. ఈ ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఒకేరోజు ఐదు పులులు మరణించడం రాష్ట్రంలో ఇదే తొలిసారి అని అధికారులు చెప్పుకొచ్చారు. అటవీ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మరణించిన పులులకు సమీపంలో ఒక ఆవు కళేబరం కనిపించింది. కొన్ని రోజుల క్రితం ఆ పులి ఆవును చంపినట్టు గుర్తించారు అధికారులు. అయితే స్థానిక గ్రామస్థులు ప్రతీకారంగా ఆవు మాంసంలో విషం కలిపి ఎర వేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
Karnataka | మృతిపై అనుమానాలు
మృతదేహాలపై శవ పరీక్ష నిర్వహించగా, విషపదార్థాల ప్రభావమే మృతికి కారణమని స్పష్టమైంది. ఫోరెన్సిక్ నివేదికను(Forensic Report) కూడా అనుసంధానించి, తుది నిర్ధారణకు సిద్ధమవుతున్నారు. ఈ ఘటనపై స్పందించిన రాష్ట్ర అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే(Ishwar Khandre), “ఇది తీవ్రమైన ఘటన. మూడు రోజుల్లోగా పూర్తి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించాం. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని చెప్పారు. ప్రస్తుతం కర్ణాటకలో 563 పులులు ఉన్నాయని అటవీ శాఖ(Forest Department) వెల్లడించింది. మధ్యప్రదేశ్ తర్వాత ఎక్కువగా పులులు ఈ రాష్ట్రంలోనే ఉన్నాయి. పులుల సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. కాగా.. గ్రామీణ ప్రాంతాల్లో పశువులపై దాడులు జరగడం, గ్రామస్థులు తమ పశువులను కాపాడుకునేందుకు వన్యప్రాణులపై విషప్రయోగానికి పాల్పడటం వంటి ఘటనలు వన్యప్రాణులకు ముప్పుగా మారుతున్నాయి.
ఈ సంఘటన వన్యప్రాణుల (Wildlife animals) రక్షణ చర్యల్లో ఉన్న లోపాలను మరోసారి బయటపెట్టింది. గ్రామస్థులు తమ పశుసంపదను కాపాడుకోవడానికి అడవి జంతువులపై ఇలాంటి విధమైన చర్యలకు పాల్పడడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం, అటవీ శాఖలు, స్థానిక ప్రజల మధ్య అవగాహన పెంచాల్సిన అవసరం మరింత స్పష్టమవుతోంది. పర్యావరణ ప్రేమికులు, వన్యప్రాణి సంరక్షకులు ఈ ఘటనపై తీవ్రంగా స్పందిస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.