అక్షరటుడే, ఇందూరు: Traffic Police : నిజామాబాద్ ట్రాఫిక్ పోలీసులు సరికొత్త వసూళ్ల దందాకు తెరలేపారు. ఎన్ఫోర్స్ మెంట్ పేరిట అడ్డదారిలో వసూళ్లకు పాల్పడుతున్నారు.
నిజామాబాద్ నగరంలో నిత్యం ఏదో ఒకచోట ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించేవారికి జరిమానాలు విధిస్తున్నారు. కొందరిపై ఎంవీ యాక్ట్, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చుతున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా ఈ వ్యవహారంలో ఓ అధికారి పెద్ద ఎత్తున వసూళ్లకు తెర తీయడం పోలీసు వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.
నిజామాబాద్ సీపీగా సాయి చైతన్య cp sai Chaitanya బాధ్యతలు చేపట్టిన అనంతరం, ఆయన ట్రాఫిక్ ఉల్లంఘనల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారు. ప్రత్యేకించి కమిషనరేట్ వ్యాప్తంగా ప్రతిరోజు వాహనాల తనిఖీలు చేయిస్తున్నారు. మైనర్ డ్రైవింగ్, త్రిపుల్ రైడింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, సౌండ్ పొల్యూషన్(సైలెన్సర్లు) వంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్ని ఠాణాల ఎస్హెచ్వోలకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ క్రమంలోనే పోలీసులు పగలు, రాత్రుల్లో ముమ్మరంగా తనిఖీలు చేపడుతూ భారీ మొత్తంలో జరిమానాలు విధిస్తున్నారు. దీంతో చాలా వరకు వాహనదారుల్లో మార్పు వచ్చింది. ఇలాగే ఇంకొద్ది నెలల పాటు ఎన్ఫోర్స్ మెంట్ జరిగితే ట్రాఫిక్ నిబంధనలు తు.చ. తప్పకుండా పాటించే అవకాశం ఉంది.
Traffic Police : ఆ అధికారి వసూళ్లపై చర్చ..
వాహనాల తనిఖీలు ఒక అంశం ఒకెత్తు అయితే.. దీని వెనుక ఓ అధికారి వసూళ్లకు తెర తీయడం మరో అంశం. నిజామాబాద్ ట్రాఫిక్ ఠాణాలో పనిచేస్తున్న సదరు అధికారి ఎన్ఫోర్స్ మెంట్ ముసుగులో వసూళ్లకు పాల్పడుతున్నట్లు బాధితుల ద్వారా తెలిసింది. ఈయన ఒత్తిడి తట్టుకోలేక పలువురు సిబ్బంది సెలవులు పెట్టి వెళ్లిపోతున్నట్లు సమాచారం.
Traffic Police : అవేంటో పరిశీలిస్తే..
- అధిక శబ్దంతో ఉండే సైలెన్సర్లు ఉన్న వాహనాలను గుర్తించి సదరు వాహనాలను సీజ్ చేసి, వాటిని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నారు. తదనంతరం సైలెన్సర్లు మార్చేస్తున్నారు. కాగా, సదరు అధికారి చెప్పిన దుకాణానికే వెళ్లి అక్కడ సైలెన్సర్ కొనుగోలు చేసి బిగిస్తేనే వాహనాన్ని రిలీజ్ చేస్తుండటం గమనార్హం. వినాయక్ నగర్ రాజీవ్గాంధీ విగ్రహం వద్ద గల దుకాణం నిర్వాహకులతో సదరు అధికారి ముందస్తు బేరం చేసుకుని, రూ.1500 విలువ గల సైలెన్సర్ను రూ.2 వేల పైచిలుకు విక్రయింపజేస్తూ వసూళ్లకు పాల్పడుతున్నట్లు కోడై కూస్తోంది.
- సదరు అధికారి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఎక్కడ తనిఖీలు నిర్వహిస్తే.. అదే ప్రాంతంలో హెల్మెట్లు విక్రయించే దుకాణం తాత్కాలికంగా వెలుస్తోంది. ఎవరైనా ద్విచక్ర వాహనదారుడు హెల్మెట్ లేకుండా పట్టుబడితే.. వెంటనే సదరు దుకాణంలో బలవంతంగా హెల్మెట్ కొనుగోలు చేయిస్తారు. లేదంటే, వాహనాన్ని వదిలిపెట్టరు. అలా రూ.400 విలువ చేసే శిరస్త్రాణం రూ.600 వరకు విక్రయించేలా ఒప్పందం చేసుకుని వసూళ్లకు పాల్పడుతున్నారు.
- డ్రంక్ అండ్ డ్రైవ్(డీడీ) కేసుల్లో సైతం సదరు అధికారి వసూళ్లకు పాల్పడుతున్నట్లు ప్రచారంలో ఉంది. సాధారణంగా డీడీ కేసుల్లో పట్టుబడిన వారిని కౌన్సెలింగ్ ఇచ్చిన అనంతరం, కోర్టులో ప్రవేశపెడతారు. కాగా, ఈ కేసుల్లోనూ సంబంధిత కోర్టు పీసీకి వసూళ్లపై టార్గెట్ విధించినట్లు సమాచారం. ఒక్కో కేసు వెనుక రూ.200 వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. కాగా, గతంలో కంటే ఈ అధికారి వచ్చిన తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు పెరగడం అవినీతి దందాకు అద్దం పడుతోంది.
Traffic Police : పరస్పర ఫిర్యాదులు
ట్రాఫిక్ స్టేషన్లో జరుగుతున్న వ్యవహారంపై సొంత విభాగం అధికారుల మధ్యనే వివాదం నెలకొంది. ఈ క్రమంలో ఇద్దరు అధికారులు ఉన్నతాధికారులకు వేర్వేరుగా పరస్పరం ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. స్పెషల్ బ్రాంచి సిబ్బంది ఇప్పటికే ఈ విషయమై ఉన్నతాధికారులకు ప్రాథమిక నివేదిక ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. కాగా, ట్రాఫిక్ విభాగానికి కీలకంగా ఉన్న ఓ అధికారి డీజీపీ కార్యాలయానికి అటాచ్ అయ్యారు. ఇందుకు గల కారణాలపై స్పష్టత లేదు. మరో అధికారిపై త్వరలోనే చర్యలు ఉంటాయని తెలుస్తోంది.