అక్షరటుడే, వెబ్డెస్క్: Toll Charges | దేశవ్యాప్తంగా ఇక నుంచి ద్విచక్ర వాహనాలకు టోల్ ఛార్జీలు(Toll charges) వసూలు చేయనున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. జూలై 15 నుంచి బైక్లకు టోల్ వసూలు చేస్తారని వార్తలు వచ్చాయి. దీంతో ద్విచక్రవాహనదారులు(Two Wheelers) ఆందోళన చెందారు. ఈ వార్తలపై తాజాగా కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ(Transport Minister Nitin Gadkari) స్పందించారు. టూవీలర్లపై టోల్ ఛార్జీల ప్రచారాలను ఆయన ఖండించారు. ఇలాంటి తప్పుడు సమాచారాలను వ్యాప్తి చేయొద్దని సూచించారు.
Toll Charges | టూ వీలర్లు, త్రీ వీలర్లకు టోల్ ఛార్జీలు లేవు
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారులపై టోల్ ప్లాజాలు(Toll plazas) పెట్టి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్ హెచ్ఏఐ) టోల్ వసూలు చేస్తోంది. టూ వీలర్లు, త్రీ వీలర్లకు టోల్ ఛార్జీలు లేవు. వారు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. కార్ల నుంచి మొదలు పెడితే భారీ ట్రక్కుల వరకు ఎన్హెచ్ఏఐ టోల్ వసూలు చేస్తోంది. ఆయా వాహనాల రకాన్ని బట్టి టోల్ ఛార్జీ ఉంటుంది. అయితే ద్విచక్ర వాహనాలకు టోల్ వసూలు చేస్తారని ప్రచారం జరగడంతో ప్రజలు ఆందోళన చెందారు. ఈ క్రమంలో తాజాగా కేంద్ర మంత్రి గడ్కరీ ప్రకటనలో వారు ఊపిరి పీల్చుకున్నారు.