అక్షరటుడే, వెబ్డెస్క్ : Inter Supplementary exams |తెలంగాణలో ఇంటర్ పరీక్ష ఫలితాలు ఏప్రిల్ 22న విడుదలయ్యాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ ఫస్టియర్లో 65.96 శాతం, సెకండియర్లో 65.65 శాతం ఉత్తీర్ణత నమోదు అయింది. అయితే ఈ పరీక్షల్లో ఫెయిల్ అయిన వారికి త్వరలో సప్లిమెంటరీ పరీక్షలు(Supplementary exams) నిర్వహించనున్నారు. మే 22 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు త్వరలోనే హాల్టికెట్లు కూడా విడుదల కానున్నాయి.
సప్లిమెంటరీ పరీక్షలకు మొత్తం 4,12,724 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఫస్టియర్ జనరల్ విద్యార్థులు 2,49,032 మంది, ఒకేషనల్ విద్యార్థులు 16,994 మంది ఉన్నారు. ఫస్టియర్ విద్యార్థుల్లో ఫెయిల్ అయిన వారితో పాటు మార్కులు పెంచుకోవడానికి ఇంప్రూవ్మెంట్(Improvement) రాసే వారు కూడా ఉంటారు. సెకండియర్ సప్లిమెంటరీ పరీక్షలకు జనరల్ విద్యార్థులు 1,34,341 మంది, ఒకేషనల్ పరీక్షలకు 12,357 మంది హాజరుకానున్నారు. సప్లిమెంటరీ పరీక్షలు మే 22 నుంచి 29 వరకు కొనసాగనున్నాయి.
Inter Supplementary exams | టైం టేబుల్ ఇదే..
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు ఉదయం ఫస్టియర్ విద్యార్థులకు, మధ్యాహ్నం సెకండియర్ విద్యార్థులు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి.
మే 22న సెకండ్ లాంగ్వేజీ, 23న ఇంగ్లిష్ పరీక్ష ఉంది. 24న మ్యాథ్స్–ఏ, బోటని, పొలిటికల్ సైన్స్, 25న మ్యాథ్స్ బీ, జువాలజీ, హిస్టరీ పరీక్షలు ఉన్నాయి. 26న ఫిజిక్స్, ఎకనామిక్స్, 27న కెమిస్ట్రీ, కామర్స్, 28న పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, బ్రిడ్జి కోర్స్ మ్యాథ్స్, 29న మోడర్న్ లాంగ్వేజీ, జియోగ్రఫీ పరీక్షలు నిర్వహించనున్నారు.