అక్షరటుడే, వెబ్డెస్క్: Visakhapatnam | విశాఖ నగరం ఐటీ రంగం(IT sector)లో దూసుకుపోతోంది. ఇక్కడికి పలు అంతర్జాతీయ కంపెనీలు కూడా తరలివస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన అమెరికన్ ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ కార్పొరేషన్(Cognizant Technology Solutions Corporation) ఇప్పుడు విశాఖను తన తదుపరి గమ్యంగా ఎంచుకోవడం గమనార్హం. విశాఖలో ఐటీ హబ్ను మరింత బలోపేతం చేయడానికి కాగ్నిజెంట్ సంస్థ రూ. 1,583 కోట్ల పెట్టుబడితో ఒక మెగా టెక్ సెంటర్ను ఏర్పాటు చేయబోతోంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే 8000 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు లభించనున్నట్లు అంచనా. ఇది విశాఖ ఐటీ రంగానికి తిరుగులేని బలం కలిగించనుంది. దీని ద్వారా విశాఖపట్నం ప్రాంతంలో యువతకు అవకాశాలు పెరిగే అవకాశం ఉంది.
Visakhapatnam | వేగంగా అభివృద్ధి..
ఈ ప్రాజెక్టు వల్ల విశాఖపట్నం నగరం మరోసారి ఇన్నోవేషన్, ఐటీ & సాఫ్ట్వేర్ సేవల కేంద్రంగా ఎదుగుతుంది. ప్రాజెక్ట్ను వేగంగా అమలు చేసే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(Andhra Pradesh Government) విశాఖ ఐటీ హిల్స్లో 22 ఎకరాల భూమిని కాగ్నిజెంట్కు కేటాయించేందుకు అంగీకరించింది. అయితే సాధారణ ధరలకు కాకుండా ప్రోత్సాహక ధరగా ఎకరానికి 99 పైసలే వసూలు చేయనుంది. ఇది ఐటీ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనం. రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామిక ప్రోత్సాహక సంస్థలు ఈ అభివృద్ధిపై హర్షం వ్యక్తం చేస్తూ, కాగ్నిజంట్కు అవసరమైన మద్దతు అందిస్తామని హామీ ఇచ్చారు. విశాఖను అగ్రగామిగా తీర్చిదిద్దే దిశగా ఇది ఒక కీలక అడుగు అని అభిప్రాయపడ్డారు.
ఈ పెట్టుబడి ప్రకటనతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడుల వర్షం కురిసే అవకాశాలు మెరుగుపడుతున్నాయని పరిశ్రమల వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ప్రతిపాదనతో పాటు మొత్తం 19 కంపెనీల పెట్టుబడుల అంశాలు ప్రభుత్వం ముందుకు వచ్చాయి. ఇవన్నీ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు (SIPB) సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chief Minister Chandrababu Naidu) అధ్యక్షతన ఆమోదించారు. SIPBకు వచ్చిన ప్రతిపాదనల విలువ రూ. 28,546 కోట్లు. ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 30,270 మందికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు అంచనా. రాష్ట్ర అభివృద్ధికి పెట్టుబడులు ఎంతో కీలకం కావడంతో, ప్రతీ సంస్థ ప్రతిపాదనను వేగంగా పరిశీలించి అవసరమైన అనుమతులు వెంటనే జారీ చేయాలని మంత్రులు, అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు.