అక్షరటుడే, వెబ్డెస్క్: YS Jagan | వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవాళ పల్నాడు(Palnadu) జిల్లాలోని సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల గ్రామానికి వెళ్లనున్నారు. పోలీసుల వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్న వైసీపీ నేత, ఉప సర్పంచ్ నాగమల్లేశ్వర రావు(Deputy Sarpanch Nagamalleshwara Rao) కుటుంబాన్ని పరామర్శించి, కుటుంబ సభ్యులకు భరోసా ఇవ్వనున్నారు జగన్. అయితే ఈ పర్యటనకు ప్రభుత్వం ఆంక్షలు విధించడం హాట్ టాపిక్ అయ్యింది. జగన్ పర్యటనపై టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. జగన్ పర్యటనకు అనుమతి ఇవ్వలేదని పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాస రావు(Palnadu SP Kanchi Srinivasa Rao) తెలిపారు. భద్రతా కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
YS Jagan | టెన్షన్ టెన్షన్..
గతంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. జగన్ భద్రతా కాన్వాయ్తో పాటుగా వంద మందికి మాత్రమే అనుమతి ఇస్తామని తేల్చి చెప్పారు. అయితే, వైసీపీ నేతలు(YCP leaders) యథావిధిగా జగన్ టూర్కు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. జగన్ పర్యటనకు ఆంక్షల పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో, జగన్ పర్యటనల వేళ హై టెన్షన్ నెలకొంది. జగన్ పరామర్శకు వస్తున్న నాగమల్లేశ్వరరావు కుటుంబం నివాసం ఉంటున్న ఇల్లు ఇరుకు సందుల్లో ఉందని అవాంఛనీయ సంఘటనలకు అవకాశం లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. జగన్(YS Jagan) పర్యటన వేళ అమరావతి ద్రోహి జగన్ అంటూ వెలిసిన ఫ్లెక్సీలను అధికారులు తొలగించారు.
జగన్ వెంట ఓ 100 మంది వస్తే, సెక్యూరిటీ కల్పిస్తామని ప్రభుత్వం అంటోంది. అంతేకానీ.. కార్యకర్తలతో భారీగా వస్తే, ఎలా సెక్యూరిటీ కల్పించగలమని అంటోంది. ఏది ఏమైనా సరే, తాను వస్తానని జగన్ తెలిపారు. జగన్ పొదిలి వెళ్లిన సమయంలో చోటు చేసుకున్న ఘటనల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. అటు జగన్ పర్యటనలో అమరావతి(Amaravati)పై సాక్షి ఛానల్లో చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసనలు జరిగే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు. దీంతో, పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వైసీపీ నాయకులు ఈ ఆంక్షలను తీవ్రంగా ఖండించారు. మాజీ మంత్రి విడదల రజని మాజీ ఎమ్మెల్యేలు కాసు మహేష్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి, సత్తెనపల్లి వైసీపీ ఇన్ఛార్జి గజ్జల సుధీర్ భార్గవ్ రెడ్డి లాంటి నేతలు కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. జగన్కు పెరుగుతున్న ప్రజాదరణను చూసి, భయపడి, పోలీసులను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు.