అక్షరటుడే, వెబ్డెస్క్ : YouTube | ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ (Smart Phone) ఉంది. యూట్యూబ్ (YouTube) అంటే తెలియని వారు లేరు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ యూట్యూబ్ చూస్తూ గంటల కొద్ది గడిపేస్తున్నారు. పసిపిల్లల నుంచి మొదలు పెడితే పండు ముసలి వరకు యూట్యూబ్ చూస్తున్నారు. ముఖ్యంగా చాలా మంది పిల్లలు యూట్యూబ్ వీడియోలు పెడితేనే అన్నం తినే పరిస్థితి ఉంది.
దీంతో యూట్యూబ్ను చాలా మంది ఆదాయ వనరుగా (Income Source) మార్చుకున్నారు. జనాలకు ఆసక్తి కలిగించే వీడియోలు తీస్తూ డబ్బు సంపాదిస్తున్నారు. అయితే కొందరు కాపీ కంటెంట్తో వీడియోలు తీస్తున్నారు. వీరికి కూడా యూట్యూబ్ ద్వారా ఆదాయం వస్తోంది. అయితే ఇలాంటి వారి విషయంలో కఠినంగా వ్యవహరించాలని యూట్యూబ్ నిర్ణయించింది. ఈ మేరకు కొత్త మానిటైజేషన్(Monetization) పాలసీని జులై 15 నుంచి అమలులోకి తీసుకు రానుంది.
YouTube | వారి ఆటలు సాగవు
చాలా మంది కష్టపడి యూట్యూబ్ వీడియోలు తీస్తుంటారు. అయితే కొందరు ఎలాంటి కష్టం లేకుండా ఇతరుల కంటెంటెను కాపీ చేసి వీడియోలు రూపొందిస్తారు. థంబ్నెయిల్స్, వాయిస్ ఓవర్ మార్చి వీడియోలు అప్లోడ్ చేస్తారు. కొందరైతే ఒకే వీడియోను రెండు మూడు ఛానెళ్లలో అప్లోడ్ చేస్తారు. కొంచెం మార్పులు చేసి వేర్వేరు ఛానెళ్లలో వీడియోలు పెట్టి డబ్బులు సంపాదిస్తున్నారు. ఇప్పటికే యూట్యూబ్ కఠినంగా నిబంధనలు అమలు చేస్తున్నా కాపీరాయుళ్లు మాత్రం ఆగడం లేదు. ఈ క్రమంలో తాజాగా కొత్త మానిటైజేషన్ పాలసీ తీసుకు వస్తున్నట్లు యూట్యూబ్ ప్రకటించింది. జులై 15 నుంచి యూట్యూబ్ పాలసీ పూర్తిగా మారిపోనుంది. కాపీ వీడియోలతో నెట్టుకొచ్చే వారికి ఆదాయం ఆగిపోనుంది.
YouTube | వ్యూస్ వచ్చినా…
సొంత కంటెంట్తో వీడియోలు చేస్తున్న వారికి మాత్రమే ఆదాయం వచ్చేలా జులై 15 నుంచి కొత్త పాలసీ అమలు చేస్తామని యూట్యూబ్ తెలిపింది. యూట్యూబ్ పార్ట్నర్ ప్రోగ్రాంలో (YPP) భాగంగా దీనిని అమలు చేస్తున్నట్లు వివరించింది. కాపీ కంటెంట్తో వీడియోలు చేసి లక్షల వ్యూస్ వచ్చినా ఇక నుంచి రూపాయి కూడా ఆదాయం రాకుండా చర్యలు చేపడతామని యూట్యూబ్ పేర్కొంది. సొంత టాలెంట్తో వీడియోలు తీస్తున్న వారిని ప్రోత్సహించి.. కాపీ రాయుళ్ల ఆటలకు యూట్యూబ్ చెక్ పెట్టాలని నిర్ణయించింది. మానిటైజేషన్ కోసం వెయ్యి మంది సబ్ స్రైబర్లతో ఉండాలని పేర్కొంది. అంతేగాకుండా 12 నెలల వ్యవధిలో సదరు ఛానెల్ కంటెంట్ 4 వేల గంటలు (Watch Hours) పూర్తి చేసి ఉండాలి. లేదంటే 90 రోజుల్లో పది మిలియన్ల షార్స్ట్ వ్యూలు సాధించాలని పేర్కొంది.