అక్షరటుడే, వెబ్డెస్క్:Rajiv Yuva Vikasam | నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) రాజీవ్ యువ వికాసం పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మందికి ఆర్థిక సాయం చేయనుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ యువతకు ఉపాధి కల్పన కోసం రూ. 50 వేల నుంచి రూ.4 లక్షల దాకా సాయం అందించనుంది. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ పూర్తి కాగా, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో అర్హులను కాకుండా కాంగ్రెస్ కార్యకర్తలనే ఎంపిక చేస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Rajiv Yuva Vikasam | పథకం మంచిదే..
నిరుద్యోగులైన యువత కోసం తీసుకొచ్చిన రాజీవ్ యువ వికాసం(Rajiv Yuva Vikasam) పథకం ఉద్దేశం చాలా మంచిదే. యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు గాను రూ.4 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తుంది. ఒక్కో యూనిట్పై 60 నుంచి 100 శాతం వరకు సబ్సిడీ లభిస్తోంది. ఇందుకోసం ప్రభుత్వం మొన్నటి బడ్జెట్లో రూ.6 వేల కోట్లను కేటాయించింది. మార్చి 15న రాజీవ్ యువ వికాసం పథకాన్ని సీఎం రేవంత్రెడ్డి(CM Revanth Reddy) ప్రారంభించారు. వ్యవసాయ, వ్యవసాయేతర రంగాలు మొత్తం 300లకు పైగా ఉపాధి అవకాశాలకు దరఖాస్తులు ఆహ్వానించారు. జూన్ 2 లోపు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి, ఆర్థిక సాయం అందించనున్నారు.
Rajiv Yuva Vikasam | కాంగ్రెస్ శ్రేణులకే ఛాన్స్..!
ఇప్పటికే గ్రామాల వారీగా దరఖాస్తుల వడపోత ప్రారంభమైంది. వందలాది దరఖాస్తుల్లో అర్హులను ఎంపిక చేయడంపై యంత్రాంగం దృష్టి సారించింది. అయితే, అర్హులైన యువతను కాకుండా అధికార పార్టీకి చెందిన వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేస్తుండడం విమర్శలకు తావిస్తోంది. ప్రధానంగా కాంగ్రెస్(Congress) వారికే ప్రాధాన్యత ఇస్తుండడంతో అర్హులకు అన్యాయం జరుగుతోందని ఆశావహులు ఆందోళన చెందుతున్నారు.
కాంగ్రెస్ శ్రేణులకు లబ్ధి చేస్తామని ఏకంగా సీఎం రేవంత్రెడ్డి(CM Revanth Reddy) పథకం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రకటించారు. ’’గత ఎన్నికల్లో పార్టీ కోసం రాత్రింబవళ్లు కష్టపడి, చదువుకుని ఖాళీగా ఉంటున్న కాంగ్రెస్ కార్యకర్తల కోసం రూ.6 వేల కోట్లు కేటాయిస్తున్నా. ఈ నిధులను కార్యకర్తల సంక్షేమం, అభివృద్ధి, ఆరోగ్యం, విద్య, భవిష్యత్తు అభివృద్ధి కార్యక్రమాలకు అంకితమిస్తూ ఉపయోగిస్తాం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు(Congress Party Leaders) రాజకీయ వ్యూహాలు మాత్రమే కాదు, తమ జీవనోపాధి కోసం కూడా పనిచేస్తున్నారు. పార్టీ కార్యకర్తలకు మాత్రమే కాదు, వారి కుటుంబాలకు కూడా ఆర్థిక భద్రత ఇవ్వడం మా ప్రాధాన్యం. వెంట తిరిగిన కార్యకర్తలకు ఏదైనా చేయాలని అన్ని నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యే(MLA)లు కూడా నన్ను కోరారు. అందుకే కార్యకర్తలకు స్వయం ఉపాధి పథకం కింద రూ.4 లక్షల వరకు అందిస్తాం. రెండు నెలల్లో ఈ డబ్బులు పంపిణీ చేస్తాం. ప్రతీ నియోజకవర్గంలో 4,000 నుంచి 5,000 మందికి డబ్బులు వస్తాయి. అర్హులైన కార్యకర్తలకు అందించే బాధ్యత ఎమ్మెల్యేలదే’ అని స్పష్టం చేశారు. సీఎం రేవంత్రెడ్డి ఆదేశాల మేరకు రాజీవ్ యువ వికాసం పథకంలో కాంగ్రెస్ శ్రేణులకే ప్రాధాన్యమిస్తున్నారని నిరుద్యోగ యువత (Unemployed Youth)ఆందోళన చెందుతున్నారు. అసలైన అర్హులను ఎంపిక చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.