అక్షరటుడే, వెబ్డెస్క్: Siddipet | ప్రస్తుతం కొంతమంది యువత లగ్జరీ లైఫ్(Luxury Life) కావాలనుకుంటున్నారు. తల్లిదండ్రుల కష్టాలను పట్టించుకోకుండా తాము అనుకున్నది కావాలని పట్టుబడుతున్నారు. సోషల్ మీడియా(Social Media)కు బానిసలుగా మారి.. అందులో ఇతరులకు ఉన్నట్లు తమకు ఫోన్లు, కార్లు, బైక్లు కావాలని తల్లిదండ్రులను అడుగుతున్నారు. ఆర్థిక స్థోమత లేని తల్లిదండ్రులు వాటిని కొనివ్వలేక సతమతం అవుతున్నారు. తాజాగా ఓ యువకుడు బీఎండబ్ల్యూ కారు(BMW Car) కొనివ్వలేదని ఆత్మహత్య చేసుకున్నాడు.
సిద్దిపేట(Siddipet) జిల్లా జగదేవ్పూర్ మండలం చాట్లపల్లి గ్రామానికి చెందిన బొమ్మ కనకయ్య, కనకమ్మ దంపతులకు కుమారుడు జానీ(21) ఉన్నాడు. పదో తరగతి వరకు చదివిన యువకుడు తల్లిదండ్రులతో కలిసి వ్యవసాయ కూలీ పనులు చేస్తున్నాడు. అయితే జానీ కొంతకాలంగా తనకు బీఎండబ్ల్యూ కారు కొనివ్వాలని తల్లిదండ్రులను అడుగుతున్నాడు. వ్యవసాయ కూలీ పనులు చేసుకొని బతికే తమకు అంత స్థోమత లేదని వారు చెప్పినా వినడం లేదు. దీంతో స్విఫ్ట్ డిజైర్ కారు కొనిస్తామని తల్లిదండ్రులు చెప్పారు. తాను అడిగిన కారు కొనివ్వడం లేదని మనస్తాపానికి గురైన జానీ పొలం వద్ద పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.