అక్షరటుడే, వెబ్డెస్క్: Accounts Block | కేంద్ర ప్రభుత్వం, సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ‘X’ మధ్య వివాదం రాజుకుంటోంది. ఎలాన్ మస్క్ (Elon Musk) నేతృత్వంలోని ఈ సోషల్ మీడియా సంస్థ.. ఇండియాలో కొనసాగుతున్న ప్రెస్ సెన్షార్ షిప్ గురించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
ఇండియాలో గ్లోబల్ న్యూస్ ఏజెన్సీ రాయిటర్స్ (global news agency Reuters) ఖాతాను నిలిపివేసిన కొన్ని రోజుల తర్వాత ఎక్స్ నుంచి ఈ ప్రకటన వెలువడడం గమనార్హం. రాయిటర్స్ ఖాతాను ఎక్స్ ఇటీవల నిలిపి వేసింది. అయితే, కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తాము ఆ పని చేశామని సదరు సంస్థ చెప్పగా, తాము ఎలాంటి ఆదేశాలు జారీ చేయాలని కేంద్రం ఖండించింది. ఈ నేపథ్యంలోనే వివాదం రాజుకోగా, దాన్ని మరింత రాజేస్తూ ‘ఎక్స్’ తాజాగా ఇండియాలో ప్రెస్ సెన్సార్ షిప్ కొనసాగుతోందని ప్రకటించింది.
Accounts Block | బ్లాక్ చేయాలని ఆదేశాలు..
ఇండియాలోని 2,355 ఖాతాలను బ్లాక్ చేయాలని భారత ప్రభుత్వం ఆదేశించిందని ‘ఎక్స్’ మంగళవారం తెలిపింది. వీటిలో వార్తా సంస్థ రాయిటర్స్కు చెందిన ఖాతాలు కూడా ఉన్నాయని పేర్కొంది. దీనిపై గతంలో కేంద్ర ఐటీ శాఖ (central IT department) విడుదల చేసిన ప్రకటనను కొట్టిపడేస్తూ ‘ఎక్స్’ తాజాగా ఈ మేరకు స్పందించింది. ఐటీ చట్టంలోని సెక్షన్ 69A కింద ఈ ఉత్తర్వు జారీ చేయబడిందని, దీనిని పాటించకపోవడం నేరపూరిత బాధ్యతకు దారి తీస్తుందని పేర్కొంది. సెన్సార్షిప్, కంటెంట్ తొలగింపు ఆదేశాలపై ‘ఎక్స్’, కేంద్ర ప్రభుత్వం మధ్య కొనసాగుతున్న ప్రతిష్టంభన తీవ్రతను ఈ పరిణామం అద్దం పడుతోంది.
Accounts Block | చట్టపరమైన చర్యలపై ఫోకస్..
ఇండియాలో ప్రెస్ సెన్సార్ షిప్పై ఆందోళనతో ఉన్నామని ‘ఎక్స్’ పేర్కొంది. “ఒక గంటలోపు తక్షణ చర్య తీసుకోవాలని ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (Ministry of Electronics and Information Technology) డిమాండ్ చేసింది. తదుపరి నోటీసు వచ్చే వరకు ఖాతాలను బ్లాక్ చేయాలని కోరింది. ప్రజల నిరసనల తర్వాత ప్రభుత్వం @Reuters మరియు @ReutersWorldలను అన్బ్లాక్ చేయమని ‘X’ని అభ్యర్థించింది” అని కంపెనీ తన గ్లోబల్ గవర్నమెంట్ అఫైర్స్ ఖాతాలో (Global Government Affairs account) పోస్ట్ చేసింది.
ఈ బ్లాకింగ్ ఆర్డర్ల కారణంగా భారతదేశంలో కొనసాగుతున్న ప్రెస్ సెన్సార్ షిప్ గురించి తాము తీవ్ర ఆందోళన చెందుతున్నామని, అందుబాటులో ఉన్న అన్ని చట్టపరమైన ఎంపికలను అన్వేషిస్తున్నామని ‘X’ పేర్కొంది.
భారతదేశంలో ఉన్న వినియోగదారులు సెన్సార్ షిప్పై చట్టపరమైన చర్యలు చేపట్టాలని సూచించింది. ఈ కార్యనిర్వాహక ఆదేశాలకు వ్యతిరేకంగా చట్టపరమైన సవాళ్లను తీసుకురావడంలో ‘ఎక్స్’ భారతీయ చట్టం ద్వారా పరిమితం చేయబడిందని, ఈ నేపథ్యంలో ప్రభావిత వినియోగదారులు కోర్టుల ద్వారా చట్టపరమైన పరిష్కారాలను అనుసరించాలని తాము కోరుతున్నామని పేర్కొంది.