అక్షరటుడే, వెబ్డెస్క్ : World War | బాంబులు పేలకుండా ఏళ్లుగా అలాగే ఉంటాయా అంటే అవుననే అంటున్నారు నిపుణులు. దశాబ్దాలుగా పేలకుండా ఉన్న బాంబులను ఇటీవల గుర్తిస్తున్నారు. రెండో ప్రపంచ యుద్ధం (World War -II) చాలా దేశాల స్థితిగతులన మార్చేసింది. అప్పటి వరకు అగ్రగామిగా ఉన్న దేశాలు పతనావస్థకు చేరితే.. పలు దేశాలు ఆధిపత్యం సాధించాయి. అయితే ఈ యుద్ధంలో జర్మనీ(Germany), జపాన్(Japan) ఎక్కువగా నష్టపోయాయి. దీనికి కారణం అమెరికా, బ్రిటన్ దేశాలు జర్మనీపై భారీగా బాంబులతో దాడులు చేయడమే. తాజాగా జర్మనీలో రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబును అధికారులు గుర్తించారు.
World War | సురక్షిత ప్రాంతాలకు ప్రజల తరలింపు
జర్మనీ (Germany) లోని కొలోన్ నగరంలో రెండో ప్రపంచ యుద్ధం సమయంలోని మూడు బాంబులను ఇటీవల గుర్తించారు. దీంతో అధికారులు అప్రమత్తమై ఆ ప్రాంతాల నుంచి ప్రజలను తరలించారు. అలాగే సమీప ప్రాంతాలకు కొంతకాలం రాకపోకలు కూడా నిలిపివేశారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా నగరవ్యాప్తంగా అంబులెన్సులు, భద్రతా బలగాలను మోహరించామన్నారు. ఈ బాంబులు అమెరికా(America) తయారు చేసినట్లు అధికారులు భావిస్తున్నారు. వీటిలో రెండు బాంబులు వెయ్యి కిలోల చొప్పున ఉండగా, ఒకటి 500 కిలోల బరువు ఉంటుంది. వాటిని నిర్వీర్యం చేయడానికి అధికారులు యత్నిస్తున్నారు.
World War | 20 శాతం పేలని బాంబులు
పోలాండ్పై 1939లో జర్మనీ దాడితో రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది. నాడు తీవ్ర దూకుడు మీద ఉన్న హిట్లర్(Hitlar) నాజీ సేనల పతనమే లక్ష్యంగా అమెరికా(America), బ్రిటన్ (Britan) కలిసి జర్మనీపై వేలకొద్ది బాంబులు వేశాయి. అందులో చాలా బాంబులు పేలకుండా అలాగే ఉండిపోయాయి. యుద్ధ సమయంలో జర్మనీపై 1.5 మిలియన్ బాంబులు వేసినట్లు సమాచారం. ఇందులో దాదాపు 20శాతం పేలకుండా అలాగే ఉండిపోయాయి. అవి అప్పుడప్పుడు ప్రజలకు కనిపిస్తుండటంతో అధికారులు నిర్వీర్యం చేశారు. 2017లో కూడా జర్మనీ అధికారులు పేలని బాంబును గుర్తించారు. 2024లో 31 బాంబులను కనుగొన్నట్లు అధికారులు తెలిపారు.