అక్షరటుడే, వెబ్డెస్క్ :Minister Post | కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటి పోయింది. మంత్రివర్గ విస్తరణ తరచూ వాయిదా పడుతూనే ఉంది.
మొదటి నుంచి మంత్రి పదవి ఆశిస్తున్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే(MLA)లకు చుక్కెదరవుతూనే ఉంది. మంత్రివర్గంలో ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం లేదు. ఈ క్రమంలో క్యాబినెట్ విస్తరణ జరిగితే ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేల్లో ఒకరికి అవకాశం దక్కడం ఖాయం. కానీ, ఏడాదిన్నరగా ఆ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy) ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉండడం, పీసీసీ చీఫ్ మహేశ్కుమార్గౌడ్ (PCC Chief Mahesh Kumar Goud) కూడా అక్కడే ఉండడంతో ఈసారి మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ఆశావహులు గంపెడాశలు పెట్టుకున్నారు. తమవంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
Minister Post | కాలయాపన..
2023 డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ (Congress Party) అనూహ్యంగా విజయం సాధించింది. బలమైన బీఆర్ఎస్(BRS)ను ఓడించి అధికారం చేపట్టింది. రేవంత్రెడ్డి ముఖ్యమంత్రిగా, కొంత మంది సీనియర్లు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఖమ్మం, నల్లగొండ జిల్లాలకు అప్పట్లో ప్రాధాన్యం ఇచ్చారు. నిజామాబాద్ nizamabad, గ్రేటర్ హైదరాబాద్ greater hyderabad, ఆదిలాబాద్ Adilabad జిల్లాలకు కేబినెట్లో బెర్తు దొరకలేదు.
ప్రభుత్వం కొలువుదీరిన కొద్ది నెలలకే మంత్రివర్గ విస్తరణ జరుగుతుందని, ఈ రెండు జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలకు అమాత్యయోగం లభిస్తుందని భావించారు. కానీ, ఏడాదిన్నరకు పైగా విస్తరణ వాయిదా పడుతూనే ఉంది. ఒకడుగు ముందుకు.. నాలుగడుగులు వెనక్కు అన్నట్లు తయారైంది. రెండు నెలల క్రితం దాదాపు విస్తరణ ప్రక్రియ కొలిక్కి వచ్చిందన్న ప్రచారం జరిగింది. ఇక ముహూర్తం ఖరారు చేయడమే మిగిలిందనుకుంటున్న తరుణంలో.. కొందరు సీనియర్లు లేఖ రాయడంతో విస్తరణకు అధిష్టానం బ్రేకులు వేసింది. దీంతో ఆశావహులకు నిరాశే మిగిలింది.
Minister Post | మళ్లీ ఊహాగానాలు..
నీతిఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ (Delhi) వెళ్లిన సీఎం రేవంత్రెడ్డి అక్కడే ఉన్నారు. మంత్రివర్గ విస్తరణపై అధిష్టానం నుంచి గ్రీన్సిగ్నల్ తెచ్చుకునేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత వ్యవహారల ఇన్చార్జి కేసీ వేణుగోపాల్(Incharge KC Venugopal)తో ఆదివారం ఆయనకు గంటకు భేటీ అయి ఇదే అంశంపై చర్చించారు. ఈ భేటీలో పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ కూడా పాల్గొన్నారు. ఆశావహులతో పాటు వారి సామాజిక సమీకరణాలు, స్థానిక బలాబలాలపై చర్చించినట్లు తెలిసింది. మరోవైపు పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్గాంధీతోనూ సమావేశమై మంత్రివర్గ విస్తరణకు ఆమోదముద్ర వేయించుకునే పనిలో రాష్ట్ర నాయకత్వం నిమగ్నమైంది. సీఎం, పీసీసీ చీఫ్ హస్తినలో మకాం వేయడంతో ఆశావహుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఈసారి తప్పకుండా విస్తరణ ఉంటుందని, తమకు అవకాశం లభిస్తుందన్న ఆశతో ఉన్నారు.
Minister Post | సీనియర్కా.. జూనియర్కా..?
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎవరికి మంత్రి పదవి దక్కుతుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఉమ్మడి జిల్లాలో మొత్తం తొమ్మిది నియోజకవర్గాలు ఉండగా, కాంగ్రెస్ పార్టీకి నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. బోధన్ నుంచి సుదర్శన్రెడ్డి(Sudarshan Reddy), నిజామాబాద్ రూరల్లో భూపతిరెడ్డి(Bhupathi Reddy), జుక్కల్లో లక్ష్మీకాంతరావు(Lakshmi Kantha Rao), ఎల్లారెడ్డిలో మదన్మోహన్రెడ్డి(Madan Mohan Reddy) ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాల్లో బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి (MLA Pocharam Srinivasa Reddy) కాంగ్రెస్ గూటికి చేరారు.
అయితే, ఉమ్మడి జిల్లా నుంచి మంత్రివర్గంలో ఎవరికీ చోటు దక్కుతుందన్న దానిపై రకరకాల ప్రచారం జరుగుతోంది. అందరి కంటే సీనియర్ అయిన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి పేరు దాదాపు ఖరారైందని ఆయన అనుచరులు చెబుతున్నారు. అదే సమయంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ పేరు కూడా వినిపిస్తోంది. గతంలో పలుమార్లు మంత్రిగా చేసిన సీనియర్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డికి హైకమాండ్ నుంచి బలమైన మద్దతు ఉంది. అయితే, మదన్మోహన్ వైపు కూడా మొగ్గు చూపుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. తొలిసారి ఎమ్మెల్యే అయినప్పటికీ.. మదన్మోహన్కు ఢిల్లీ పెద్దలతో మంచి సంబంధాలు ఉన్నాయి. సీనియర్, జూనియర్ ఎమ్మెల్యేల మధ్య పోటీ ఉన్నప్పటికీ, అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
Minister Post | ఆశావహులు ఎక్కువే..
ఉమ్మడి జిల్లా నుంచి మంత్రి పదవి ఆశిస్తున్న కాంగ్రెస్ నేతలు (Congrss Leaders) చాలా మందే ఉన్నారు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డిని కలుపుకుని ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. వారికి తోడు మరికొంత మంది పార్టీ సీనియర్లు కూడా ఆశలు పెట్టుకున్నారు. ఉమ్మడి జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన పోచారం శ్రీనివాసరెడ్డి పదవిపై ఆశలు పెట్టుకున్నప్పటికీ, ఆయనకు అవకాశం దక్కదనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ (Former Minister Shabbir Ali) సైతం మైనార్టీ కోటాలో మంత్రి పదవి దక్కడం ఖాయమన్న ధీమాతో ఉన్నారు. కానీ, ఆయన ఎమ్మెల్సీ పదవీ ముగియడంతో మళ్లీ అవకాశం కల్పించలేదు. ఈ నేపథ్యంలో ఆయనకు అమాత్య యోగం దక్కుతుందా? అన్నది సందేహాస్పదమేనని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. ఎమ్మెల్యేలు సుదర్శన్రెడ్డి, మదన్మోహన్ పేర్లు బలంగా వినిపిస్తుండగా, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి కూడా ఆశలు పెట్టుకున్నట్లు చెబుతున్నారు. అయితే, సామాజిక సమీకరణాల దృష్ట్యా ఎవరికి అవకాశం దక్కుతుందన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.