అక్షరటుడే, వెబ్డెస్క్: Bandi Sanjay | కాంగ్రెస్ పార్టీ ఏం ఉద్దరించిందని ‘సామాజిక న్యాయ సమర భేరీ’ సభను నిర్వహించారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Union Minister of State for Home Affairs Bandi Sanjay) ప్రశ్నించారు. యాభై ఏళ్లకు పైగా పాలించిన కాంగ్రెస్ ఏనాడైనా బీసీ వ్యక్తిని ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రిని చేసిందా? అని నిలదీశారు. కాంగ్రెస్ సభ పేరును సామాజిక అన్యాయ సమర భేరిగా మార్చుకోవాలని ఎద్దేవా చేశారు. వేములవాడ నియోజకవర్గంలోని (Vemulawada constituency) కోనరావుపేట మండలం మరిమడ్ల గ్రామంలో రూ.5 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు బండి సంజయ్ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై విమర్శనాస్త్రాలు సంధించారు. ‘‘ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని అర్ధశతాబ్దానికిపైగా పాలించిన కాంగ్రెస్ పార్టీ ఇన్నేళ్లలో ఒక్కసారైనా బీసీని ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రిని చేయలేదు? దళిత, బడుగు, బలహీనవర్గాలు అత్యధిక లబ్ది పొందే అవకాశమున్న 6 గ్యారంటీలను కూడా అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోంది. మరి ఏ ముఖం పెట్టుకుని సభను నిర్వహిస్తున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (AICC President Mallikarjun Kharge) ప్రజలకు సమాధానం చెప్పాలి. లేకుంటే ఆ సభకు సామాజిక అన్యాయ సమర భేరీ అని పేరు మార్చుకోవాలని పేర్కొన్నారు.
Bandi Sanjay | బీసీలకు పెద్దపీట వేసిందే బీజేపీ..
కాంగ్రెస్ ఏం ఉద్దరించిందని సభ నిర్వహిస్తున్నదో ప్రజలకు సమాధానం చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ దేశాన్ని అర్ధశతాబ్దానికిపైగా పాలించిన కాంగ్రెస్.. ఇన్నేళ్లలో ఒక్కసారైనా బీసీని ప్రధానమంత్రిని చేశారా? అని ప్రశ్నించారు. బీజేపీ ఒక్కటే బీసీలకు పెద్దపీట వేసిందన్నారు. ‘బీసీని ప్రధానిని చేసింది. దళిత వర్గానికి చెందిన రామ్ నాథ్ కోవింద్ను, ఆదివాసీ బిడ్డ ద్రౌపది ముర్మును (Draupadi Murmu), మైనారిటీకి చెందిన అబ్దుల్ కలాంను రాష్ట్రపతిగా చేసిన ఘనత కూడా బీజేపీదేనని’ తెలిపారు. చరిత్రలో ఎన్నడూలేని విధంగా 27 మంది ఓబీసీలకు, 12 మంది దళితులకు, ఆరుగురు దళితులను, 8 మంది మహిళలకు కేంద్ర కేబినెట్లో చోటు కల్పించిన చరిత్ర బీజేపీదేనని వివరించారు. బీసీ వర్గానికి చెందిన మోదీ ప్రధాని అయితే కాంగ్రెస్ పార్టీకి కంటగింపుగా ఉందని, ప్రధానిని ఛాయ్ వాలా అంటూ హేళన చేసిన పార్టీ కాంగ్రెస్ అని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్రంలోకి అధికారంలోకి వస్తే బీసీ సీఎం అవుతారని ప్రకటించిన నేత మోదీ అని గుర్తు చేశారు. 50 శాతానికిపైగా బీసీ జనాభా (BC population) ఉందని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ.. రాష్ట్ర కేబినెట్లో ఎంత మంది బీసీలకు అవకాశమిచ్చారని ప్రశ్నించారు. బీసీ నేత పొన్నం ప్రభాకర్ (BC leader Ponnam Prabhakar)కు పదవి ఇస్తే బీసీల గొంతు వినిపించారు. మరింత మంది బీసీలకు ఇస్తే న్యాయం జరిగేది కదా? మరీ ఏ ముఖం పెట్టుకుని సామాజిక న్యాయ సమరభేరి సభ పెడుతున్నారు? బీసీల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్కు లేనేలేదని స్పష్టం చేశారు.
Bandi Sanjay | గ్యారంటీల పేరిట కాంగ్రెస్ మోసం
ఆరు గ్యారంటీల పేరిట కాంగ్రెస్ అన్ని వర్గాలను మోసం చేసిందని బండి విమర్శించారు. ప్రతి మహిళకు రూ.2500 పెన్షన్, రూ.4 వేల ఆసరా పెన్షన్లు, రూ.4వేల నిరుద్యోగ భ్రుతి, విద్యార్థులకు రూ.5 లక్షల భరోసా కార్డు, బోనస్ బకాయిలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఇచ్చిన 6 గ్యారంటీలతోపాటు మేనిఫెస్టోలోని 420 హామీలను ఎందుకు అమలు చేయలేకపోయారని నిలదీశారు. వీటిపై సామాజిక న్యాయ సమర భేరీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (AICC President Mallikarjuna Kharge) సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. యూరియా కొరతపై కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కావాలనే కేంద్రాన్ని బదనాం చేస్తున్నాయన్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధమవుతుంటే ఓర్వలేక బదనాం చేస్తున్నారని తెలిపారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala Nageswara Rao) అనుభవజ్ఞులు. ఆయనను అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారని, తుమ్మల వాస్తవాలు గ్రహించాలని సూచించారు. గత సీజన్ లో 9 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమైతే కేంద్రం 12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఇచ్చింది. అదనంగా ఇచ్చిన 3 లక్షల మెట్రిక్ టన్నులు యూరియా ఎటు పోయిందని ప్రశ్నించారు. వాటిని ఏం చేశారో లెక్కలు చెప్పకుండా కేంద్రాన్ని బదనాం చేయడం సరికాదన్నారు.