అక్షరటుడే, వెబ్డెస్క్ : Mahanadu 2025 | టీడీపీ మహానాడు (TDP Mahanadu) కార్యక్రమం రెండో రోజు ఘనంగా సాగుతోంది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు (CM Chandra Babu) నాయుడు మాట్లాడుతూ.. మహిళలను కించపరిచే వారికి మాస్ వార్నింగ్ ఇచ్చారు. సోషల్ మీడియా(Social Media)లో మహిళలపై అసభ్యకర కామెంట్స్ చేస్తే.. తాట తీస్తాం అని ఆయన హెచ్చరించారు. మహిళల సంక్షేమమే ధ్యేయంగా తమ ప్రభుత్వం పని చేస్తుందన్నారు. డ్వాక్రా మహిళలను పారిశ్రామిక వేత్తలను చేస్తామని హామీ ఇచ్చారు.
Mahanadu 2025 | ఉచిత బస్సు సౌకర్యం అప్పటి నుంచే..
తాము అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తామని టీడీపీ ప్రకటించింది. ఇందులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం (Free Bus) కల్పించడం కూడా ఒకటి. మహానాడులో ఈ హామీపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. ఆగస్ట్ 15 నుంచి RTC బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం అమలు చేస్తామని ఆయన తెలిపారు. దీపం-2 పథకంలో ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. రాజకీయంగా, ఆర్థికంగా మహిళలను అభివృద్ధి చేస్తామన్నారు.
Mahanadu 2025 | రైతులకు అండగా ఉంటాం..
రైతులకు అండగా ఉంటామని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న నీటిపారుదల ప్రాజెక్ట్లను వెంటనే పూర్తి చేసి, అన్నదాతలకు సాగు నీరు అందిస్తామని తెలిపారు. అరకు కాఫీ(Araku Coffee)కి బ్రాండ్ క్రియేట్ చేస్తున్నట్లు వివరించారు. పోలవరం(polavaram), బనకచర్ల(banakacharla) ప్రాజెక్ట్లను పూర్తి చేసి, రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామని ప్రకటించారు.
Mahanadu 2025 | కోవర్టులతో జాగ్రత్త
పార్టీలో కోవర్టులు ఉన్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కొంతమంది ప్రత్యర్థులతో చేతులు కలిపిన కోవర్టులు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. వాళ్ల ప్రోత్సాహంతో హత్యా రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు తాను ఎవరినీ నమ్మడం లేదన్నారు. ఇలాంటి తప్పుడు పనులు చేసే ఏ కార్యకర్తను కూడా వదిలిపెట్టనని ఆయన హెచ్చరించారు.