అక్షరటుడే, వెబ్డెస్క్ : Diesel vehicles | హైదరాబాద్ (Hyderabad) నగరంలో కాలుష్యం తగ్గించడానికి చర్యలు చేపట్టినట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు.
శనివారం ఆయన పీజేఆర్ ఫ్లై ఓవర్ (PJR Flyover)ను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. భవిష్యత్లో నగరంలో జనాభా మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. కాలుష్యం పెరిగితే భవిష్యత్ తరాలు నగరంలో జీవించలేవని.. అందుకే కాలుష్య నివారణ కోసం చర్యలు చేపడుతామన్నారు. ఇందులో భాగంగా డీజిల్ వాహనాల (Diesel vehicles)ను నగరానికి అవతలకు పంపించే చర్యలు చేపట్టినట్లు ఆయన వివరించారు.
Diesel vehicles | గుణపాఠం నేర్చుకోవాలి
ప్రస్తుతం కాలుష్యం కారణంగా దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో నివసించలేని పరస్థితి ఏర్పడిందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. అలాగే వర్షం వస్తే చెన్నై నగరం నీట మునుగుతుందన్నారు. బెంగళూరువాసులు ట్రాఫిక్ సమస్యతో అనేక ఇబ్బందులు పడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆయా నగరాల నుంచి మనం గుణపాఠం నేర్చుకోవాలని సీఎం సూచించారు.
Diesel vehicles | ఎలక్ట్రిక్ ఆటోలు కొనండి
నగరంలోని డీజిల్ వాహనాలను తొలగిస్తామని సీఎం అన్నారు. నగరంలో 3 వేల ఎలక్ట్రిక్ బస్సులు మాత్రమే తిరిగేలా చూస్తామన్నారు. అలాగే ఆటో డ్రైవర్లు కూడా డీజిల్ ఆటోలను తీసేసి ఎలక్ట్రిక్ ఆటోలు కొనుగోలు చేయాలని సూచించారు. ప్రభుత్వం తరఫున కూడా ఆటో డ్రైవర్లకు ఎలక్ట్రిక్ ఆటోలు కొంటే సాయం చేయడానికి చర్యలు చేపడుతామన్నారు. అలాగే ట్యాక్సీలు, ఇతర వాహనదారులు కూడా డీజిల్ బండ్లను తీసేయాలని ఆయన సూచించారు. ఎలక్ట్రిక్ వాహనాలు (Electric vehicles) కొనేవారికి పన్ను రద్దు చేసినట్లు సీఎం గుర్తు చేశారు.
Diesel vehicles | నాలాల కబ్జాతోనే ముంపు
నగరంలోని నాలాలు కబ్జా అవడంతోనే వర్షాలకు పలు ప్రాంతాలు నీట మునుగుతున్నాయని సీఎం తెలిపారు. దీంతో చెరువులు, నాలాల రక్షణకు హైడ్రా (Hydraa) ఏర్పాటు చేశామన్నారు. అక్రమ నిర్మాణాలను మాత్రమే హైడ్రా కూల్చి వేసిందన్నారు. వరద నీళ్లు వెళ్లేందుకు చెరువుల్లేకుండా కొందరు కబ్జాలు చేశారని సీఎం పేర్కొన్నారు. బతుకమ్మకుంటను బీఆర్ఎస్ నాయకులు (BRS Leaders) ఆక్రమించుకుంటే కబ్జా నుంచి విడిపించామని సీఎం తెలిపారు.