అక్షరటుడే, వెబ్డెస్క్:పక్కా ప్రణాళికా ప్రకారమే ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ను హత్య చేశారని జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాస్రావు వెల్లడించారు. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను అడ్డు తొలగించుకునేందుకు భార్య తన ప్రియుడితో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు వివరించారు. తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన ఈ హత్య కేసును ఛేదించామని చెప్పారు. ఈ కేసులో 8 మంది నిందితులను అరెస్టు చేసి, రిమాండ్కు తరలిస్తున్నట్లు చెప్పారు. గద్వాల ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. అనంతరం ఎస్పీ శ్రీనివాసరావు కేసు వివరాలు వెల్లడించారు. నిందితుల నుంచి కారు, 2 కొడవల్లు, ఒక కత్తి, రూ.1.20 లక్షల నగదు, 10 మొబైల్ పోన్లు, జీపీఎస్ ట్రాకర్ను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.
Gadwal SP | పెళ్లికి ముందే అక్రమ సంబంధం
మే 17వ తేదీన బీచుపల్లి దేవస్థానంలో తేజేశ్వర్, కర్నూల్ జిల్లాకు చెందిన ఐశ్వర్యల వివాహం జరిగిందని, వారు కొన్ని రోజులపాటు కర్నూల్లోనే కాపురం పెట్టారన్నారు. అయితే, బ్యాంక్ మేనేజర్ తిరుమలరావుకు, తేజేశ్వర్ భార్య ఐశ్యర్యకు పెళ్లికి ముందు నుంచే అక్రమ సంబంధం ఉందని ఎస్పీ వెల్లడించారు. ఈ నేపథ్యంలో పెళ్లికి ముందే ఇద్దరు కలిసి తేజేశ్వర్ను అంతమొందించాలని కుట్ర పన్నారని తెలిపారు. అందుకే తేజేశ్వర్ బైక్లో జీపీఎస్ పరికరం అమర్చారన్నారు. పెళ్లయ్యాక కర్నూల్లో ఉంటున్న సమయంలో ఐశ్వర్య, తిరుమలరావుతో సన్నిహితంగా ఉండడం చూసిన తేజేశ్వర్.. అనుమానం వచ్చి భార్య ఐశ్వర్యను గద్వాలకు తీసుకువచ్చాడన్నారు.
Gadwal SP | భార్యను చంపేందుకూ తిరుమల్రావు ప్లాన్..
గద్వాలకు వచ్చినప్పటికీ, ఐశ్వర్య, తిరుమల్రావు మధ్య సంబంధం కొనసాగిందని, గంటల తరబడి ఫోన్ కాల్స్, వీడియో కాల్స్లో మాట్లాడేవారని ఎస్పీ తెలిపారు. ఈ క్రమంలోనే తమ మధ్య బంధానికి అడ్డుగా ఉన్న తేజేశ్వర్ను హత్య చేసేందుకు ఐశ్వర్య, తిరుమల్రావు కలిసి కుట్ర చేశారని తెలిపారు. ఐశ్వర్య తల్లితోనూ బ్యాంకు మేనేజర్ తిరుమల్రావుకు వివాహేతర సంబంధం ఉందని చెప్పారు. 2019లో తిరుమల్రావుకు వివాహం జరిగినప్పటికీ పిల్లలు పుట్టలేదన్నారు. ఈ క్రమంలోనే ఐశ్వర్యను రెండో పెళ్లి చేసుకోవాలనుకున్నాడని తెలిపారు. మరోవైపు, తమ బంధానికి అడ్డుగా ఉన్న తిరుమల్రావు భార్యను కూడా చంపేయాలని అనుకున్నారని సంచలన విషయం వెల్లడించారు. అయితే, దీని వల్ల కుటుంబాలన్నీ వీధిన పడతాయని భావించి, ఆ ప్రయత్నం విరమించుకున్నారన్నారు.
Gadwal SP | పెళ్లి జరిగిన నెలకే..
అయితే, తేజేశ్వర్ను అడ్డు తొలగించుకుని హాయిగా జీవించాలని ఐశ్వర్య, తిరుమల్రావు కుట్ర పన్నారని ఎస్పీ చెప్పారు. తేజేశ్వర్ను నాలుగైదు సార్లు హత్యాయత్నం చేయడంలో విఫలమయ్యారని ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. వివాహమైన నెలకే భర్త తేజేశ్వర్ను భార్య ఐశ్వర్య హత్య చేయించిందని ఎస్పీ తెలిపారు. ఈ నెల 17న అదృశ్యమైన ప్రైవేటు సర్వేయర్ తేజేశ్వర్ 21న గాలేరు-నగరి కాలువలో మృతదేహమై కనిపించాడన్నారు. తేజేశ్వర్ను చంపాలనని తన వద్దకు రుణం కోసం వచ్చిన నగేశ్తో తిరుమల్రావు ఒప్పందం కుదుర్చుకున్నాడన్నారు. ఈ హత్య తర్వాత లద్దాఖ్ వెళ్లాలని ఐశ్వర్య, తిరుమల్రావు నిర్ణయించుకున్నారని తెలిపారు. తేజేశ్వర్ను కారులోనే కొడవలితో నరికి చంపారని ఎస్పీ చెప్పారు. హనీమూన్ హత్య ఘటన తరహాలో దొరక్కుండా జాగ్రత్తగా ఉండాలని నిందితులు చర్చించుకున్నారని వివరాలు వెల్లడించారు. హత్య చేసిన నిందితుల దుస్తులకు రక్తపు మరకలు ఉన్నాయని, నిందితుల కోసం తిరుమల్రావు కొత్తగా దుస్తులు కొన్నారని గద్వాల్ ఎస్పీ పేర్కొన్నారు. సెల్ ఫోన్ కాల్స్.. కారు ట్రాకింగ్ ఆధారంగా పోలీసులు ఈ కేసును ఛేదించారని ఎస్పీ వెల్లడించారు. ఐశ్వర్య, తిరుమల్రావు, ఐశ్వర్య తల్లి సహా నిందితులను అరెస్టు చేశామన్నారు. ఆర్నెళ్లలోపు నిందితులకు శిక్ష పడేలా ప్రయత్నిస్తామని చెప్పారు.