అక్షరటుడే, వెబ్డెస్క్:Operation Sindoor | పాకిస్తాన్ తో జరిగిన ఉద్రిక్తతల సమయంలో యుద్ధ విమానాలను కోల్పోయామని భారత సైన్యం (Indian Army) తొలిసారిగా వెల్లడించింది. అయితే కోల్పోయిన యుద్ధ విమానాల సంఖ్యను వెల్లడించలేదు. ఆరు యుద్ధ విమానాలను కూల్చేశామంటూ పాక్(Pakistan) చేస్తున్న ప్రచారం పూర్తిగా తప్పని కొట్టిపడేసింది.
నాలుగు రోజుల యుద్ధంలో ఏరోజూ అణుయుద్ధం వరకూ వెళ్లే పరిస్థితి రాలేదని పేర్కొంది. సింగపూర్లో శనివారం షాంగ్రి-లా-డైలాగ్ (Shangri-La-Dialogue) కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సీడీఎస్ అనిల్ చౌహాన్ (CDS Anil Chauhan) ఈ సందర్భంగా బ్లూమింగ్ టీవీతో జరిగిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయం వెల్లడించారు.
ఆరు యుద్ధ విమానాలను కూల్చేశామంటూ పాక్ చేస్తున్న ప్రచారం పూర్తిగా తప్పని ఆయన కొట్టివేశారు. యుద్ధ విమానాలను నేలకూల్చిన అంశం ముఖ్యం కాదని, ఎలాంటి పొరపాట్లు జరగాయన్నదే ముఖ్యమని తెలిపారు. వ్యూహాత్మక తప్పిదాలు ఏమి జరిగాయో తెలుసుకుని వాటిని సరిచేసుకుని, రెండు రోజుల తర్వాత తిరిగి అమలు చేశామని, తిరిగి అన్ని విమానాలను సుదీర్ఘ లక్ష్యాల వైపు మళ్లించామని చెప్పారు.
Operation Sindoor | జెట్లు ఎందుకు కూలిపోయాయన్నదే ప్రధానం..
ఫైటర్ జైట్లు(Fighter jets) కూలిపోయామని వెల్లడించిన అనిల్ చౌహాన్.. వాటి సంఖ్యను వెల్లడించేందుకు నిరాకరించారు. “ముఖ్యమైనది ఏమిటంటే, జెట్ కూలిపోవడం కాదు.. కానీ అవి ఎందుకు కూలిపోతున్నాయి” అన్న దానిపై దృష్టి పెట్టి, పొరపాట్లను సరిదిద్దుకున్నామని చెప్పారు. ఎన్ని జెట్లు కూలిపోయాయన్నది వెల్లడించని సీడీఎస్.. “అవి ఎందుకు కూలిపోయాయి, ఏ తప్పులు జరిగాయి – అన్నదే ముఖ్యమైనవి” అని ఫైటర్ జెట్ల గురించి అడిగినప్పుడు జనరల్ చౌహాన్(General Chauhan) అన్నారు. “సంఖ్య ముఖ్యం కాదు” అని వివరించారు. “ముఖ్యమైనది ఏమిటంటే మనం చేసిన వ్యూహాత్మక తప్పిదాన్ని అర్థం చేసుకోగలుగుతున్నాము, దాన్ని సరిదిద్దుకోగలుగుతున్నాము, రెండు రోజుల తర్వాత మళ్ళీ తిరిగి వ్యూహాత్మక ప్రణాళికలను అమలు చేశాము. సుదూర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని మా జెట్లు టార్గెట్లను ధ్వంసం చేశాయని ” అని జనరల్ చౌహాన్ అన్నారు.
భవిష్యత్ యుద్ధాలు ఎలా ఉండనున్నాయనడానికి పాకిస్థాన్పై జరిపిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) నిదర్శనమని సీడీఎస్ అనిల్ చౌహాన్ అన్నారు. మోడ్రన్ వార్ఫేర్ అనేది ఇప్పుడు టెక్నాలజీ, సైబర్ ఆపరేషన్స్, సమాచారాన్ని కంట్రోల్ చేసే సామర్థ్యంపై ఆధారపడి ఉంటోందన్నారు. ఆపరేషన్ ప్రారంభంలో మొదటి మూడు రోజులు ఇద్దరు మహిళా అధికారులు ప్రధాన స్పోక్స్పర్సన్స్గా మీడియాకు సమాచారం ఇచ్చారన్నారు. ఆపరేషన్ వేగవంతంగా నిర్వహించేందుకు మిలటరీ నాయకత్వం బిజీగా ఉండటంతో ఆ ఇరువురు మీడియా మందుకు వచ్చారని తెలిపారు.
Operation Sindoor | ట్రంప్ వ్యాఖ్యలు అసంబద్ధం
ఆరు భారతీయ యుద్ధ విమానాలను కూల్చివేశామని పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ (Pakistan Prime Minister Shehbaz Sharif) ఇటీవల తెలిపారు. అయితే, దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. అయితే, ఫైటర్ జైట్లను కోల్పోయామన్న సీడీఎస్.. పాక్ ప్రధాని ప్రకటనను సీడీఎస్ కొట్టిపడేశారు. సంఖ్యను మాత్రం చెప్పేందుకు ఇష్టపడలేదు. అణు యుద్ధాన్ని నివారించడానికి అమెరికా సహాయం చేసిందన్న ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వాదనపై స్పందించడానికి జనరల్ చౌహాన్ నిరాకరించారు. కానీ ఇరుపక్షాలు అణ్వాయుధాలను ఉపయోగించేందుకు సిద్ధంగా ఉన్నాయన్న ఆయన వ్యాఖ్యలు “చాలా అసంబద్ధం” అని తెలిపారు. సంప్రదాయ కార్యకలాపాల నిర్వహణకు, అణు పరిమితికి మధ్య చాలా అంతరం ఉందని వ్యక్తిగతంగా భావిస్తున్నానని జనరల్ చౌహాన్ అన్నారు. పరిస్థితిని నియంత్రించడానికి పాకిస్తాన్ తో కమ్యూనికేషన్ మార్గాలు “ఎల్లప్పుడూ తెరిచి ఉండేవి” అని తెలిపారు.
Operation Sindoor | ‘రెడ్ లైన్స్’
చైనా, ఇతర దేశాల నుంచి మోహరించిన ఆయుధాల ప్రభావం గురించి పాకిస్తాన్ (Pakistan) వాదనలను జనరల్ చౌహాన్ స్పందిస్తూ.. అవి “పనిచేయలేదు” అని అన్నారు. భారతదేశంతో జరిగిన ఘర్షణలో చైనా, పాకిస్తాన్ కు వైమానిక రక్షణ, ఉపగ్రహ సహాయాన్ని అందించిందని భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఒక పరిశోధనా బృందం ఈ నెలలో తెలిపింది. “300 కిలోమీటర్ల దూరంలోని పాక్ భారీగా వైమానిక రక్షణ కలిగిన వైమానిక స్థావరాలపై, ఒక మీటర్ కచ్చితత్వంతో మేము కచ్చితమైన దాడులు చేయగలిగాము” అని సీడీఎస్ తెలిపారు. ప్రస్తుతానికి కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతుందని, అది భవిష్యత్తులో పాకిస్తాన్ చర్యలపై ఆధారపడి ఉంటుందని చెప్పారు.