అక్షరటుడే, వెబ్డెస్క్: Indonesia | ఇండోనేషియాలో భీకర వాతావరణ నెలకొంది. భారీ అగ్నిపర్వతం బద్దలవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. తూర్పు ఇండోనేషియాలోని లెవోటోబి లకి-లకి (Mount Lewotobi Laki-Laki volcano) బద్దలైంది. దీంతో సమీపంలోని బాలికి వెళ్లే ఎయిరిండియా (Air India) విమానాన్ని వెనక్కి మళ్లించాల్సి వచ్చింది.
ఇండోనేషియా నుంచి తిరుగుపయనమైన విమానం బుధవారం ఢిల్లీకి సురక్షితంగా చేరుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. భారత్తో పాటు సింగపూర్, ఆస్ట్రేలియా తదితర దేశాల నుంచి బాలికి వెళ్లే పలు అంతర్జాతీయ విమానాలను(International flights) రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
అగ్నిపర్వతం విస్ఫోటనం కారణంగా ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని.. తూర్పు ఇండోనేషియాలోని నుసా టెంగారా ప్రావిన్స్లోని విమానాశ్రయాన్ని(Tenggara province Airport) మూసివేసినట్లు అధికారులు వివరించారు.
తూర్పు నుసా టెంగారా ప్రావిన్స్లోని లెవోటోబి లకి-లకి పర్వతం మంగళవారం విస్ఫోటనం చెందింది. దీంతో 11 కి.మీ. ఎత్తులో బూడిద ఎగసిపడినట్లు వోల్కనాలజీ అండ్ జియోలాజికల్ హజార్డ్ మిటిగేషన్ (PVMBG) ప్రకటించింది.
కాగా.. బుధవారం ఉదయం అగ్నిపర్వతంలో మళ్లీ విస్ఫోటనం ఏర్పడడంతో ఒక కి.మీ. ఎత్తులో దట్టమైన బూడిద ఎగసిపడింది. అగ్నిపర్వతం విస్ఫోటనం కారణంగా దాని సమీప గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు స్థానిక విపత్తు నిర్వహణ సంస్థ అధికారి తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. మాస్కులు ధరించి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ అగ్గి పర్వతం గత మేలోనూ పలుమార్లు బద్దలయ్యిందని అధికారి వివరించారు.