అక్షరటుడే, వెబ్డెస్క్: Sunil Gavaskar | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు RCB ఎట్టకేలకు 18 ఏళ్లకు ఐపీఎల్ ట్రోఫీ(IPL trophy)ని సాధించింది. రజత్ పాటిదార్(Rajat Patidar) నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫైనల్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ను 6 పరుగుల తేడాతో ఓడించి టైటిల్ దక్కించుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ఆ తర్వాత పంజాబ్ కింగ్స్(Punjab Kings) 20 ఓవర్లలో 184 పరుగులు మాత్రమే చేయగలిగింది. అయితే ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వ్యవహరించిన తీరుపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్(Sunil Gavaskar) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు.
Sunil Gavaskar | ఎందుకిలా చేశావ్..
కోహ్లీ (Virat Kohli) ప్రమాదకరంగా పిచ్ మధ్యలో పరుగెత్తినప్పటికీ ఫీల్డ్ అంపైర్లు పట్టించుకోకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించిందని గవాస్కర్ అన్నారు. ఆర్సీబీ(RCB) ఇన్నింగ్స్లో 12వ ఓవర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. టాస్ ఓడిన ఆర్సీబీ తొలుత బ్యాటింగ్ చేసింది. బౌండరీలు రావడం కష్టంగా ఉన్న పిచ్పై కోహ్లీ సింగిల్స్, డబుల్స్తో స్కోరు బోర్డును నడిపించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో యజువేంద్ర చాహల్(Yuzvendra Chahal) వేసిన 12వ ఓవర్లో బంతిని లాంగ్-ఆన్ వైపు నెట్టి వేగంగా రెండో పరుగు కోసం ప్రయత్నించాడు. నాన్-స్ట్రైకర్ ఎండ్లో ఉన్న భాగస్వామి లియామ్ లివింగ్స్టోన్ డైవ్ చేసి సురక్షితంగా క్రీజులోకి చేరుకున్నాడు.
ఈ క్రమంలో కోహ్లీ నేరుగా పిచ్ మధ్యలో పరుగెత్తాడు. అలా చేస్తే పిచ్ Pitch దెబ్బతినే అవకాశం ఉందని, ఇది ఆటను ప్రభావితం చేస్తుందని భావిస్తారు. లైవ్ కామెంట్రీలో ఉన్న గవాస్కర్ ఈ విషయాన్ని వెంటనే ప్రస్తావించాడు. “కోహ్లీ వికెట్ల మధ్య చాలా వేగంగా పరుగెత్తుతాడు. బంతిని కొట్టిన వెంటనే అది రెండు పరుగులు వస్తుందని అతనికి తెలుసు” అని గవాస్కర్ అన్నాడు. “అతడిని ఏ అంపైర్ కూడా ఎప్పటికీ ఏమీ అనడు. ఇదుగో, మళ్లీ పిచ్ మధ్యలోనే పరుగెడుతున్నాడు. పంజాబ్ కింగ్స్ రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయాల్సి ఉంది” అంటూ అంపైర్ల తీరును తప్పుబట్టాడు. అయితే టాప్ ఆటగాళ్లు ఇలాంటి చర్యలకు పాల్పడినా కొన్నిసార్లు ఉపేక్షిస్తారా అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ సీజన్లో దాదాపు 150 స్ట్రైక్ రేట్తో దూకుడుగా ఆడిన కోహ్లీ ఫైనల్లో మాత్రం అందుకు భిన్నంగా ఆచితూచి ఆడాడు.