అక్షరటుడే, వెబ్డెస్క్: Ahmedabad Airport | గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో (Ahmedabad) గురువారం మధ్యాహ్నం జరిగిన ఘోర విమాన ప్రమాదంతో దేశం ఉలిక్కి పడింది. లండన్లోని (London) గాట్విక్ విమానాశ్రయానికి బయలుదేరిన ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ171 విమానం, టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అహ్మదాబాద్ విమానాశ్రయ (Ahmedabad Airport) సమీపంలోని మేఘాని నగర్లో నివాస ప్రాంతంలో కుప్పకూలింది. ఈ విమానంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ (Vijay Rupani) కూడా ఉన్నారు.
Ahmedabad Airport | భార్య కోసం..
విజయ్ రూపానీ లండన్(London)లో ఉన్న భార్యను (Wife) భారత్ తీసుకువచ్చేందుకు ఈ విమానంలోనే లండన్కు పయనమయ్యారని సమాచారం. చెక్-ఇన్ పత్రాల ప్రకారం, ఆయన బిజినెస్ క్లాస్లో (సీటు నంబర్ 2డి) ప్రయాణించేందుకు మధ్యాహ్నం 12:10 గంటలకు జోన్ 1 నుంచి బోర్డింగ్ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన టికెట్ బుకింగ్ రిఫరెన్స్ 6ఎఫ్కే2ఎం2 కాగా, ఇ-టికెట్ నంబర్ (e-ticket number) 0982865207073గా నమోదై ఉంది. విమాన ప్రమాద తీవ్రత కారణంగా, ఇందులో ప్రయాణిస్తున్న వారు ప్రాణాలతో బయటపడే అవకాశాలు అత్యంత స్వల్పమని నిపుణులు చెబుతున్నారు.
గురువారం మధ్యాహ్నం 1.38 గంటలకు.. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ (Ahmedabad Airport) నుంచి ఎయిర్ ఇండియా (Air India) బోయింగ్ డ్రీమ్లైనర్ 787 విమానం 232 మంది ప్రయాణికులు, 12 మంది విమాన సిబ్బందితో లండన్కు బయలుదేరింది. అలా బయలుదేరిన కొన్ని నిమిషాల్లోనే విమానం కుప్పకూలింది. విమాన ప్రయాణ సమాచారాన్ని అందించే ఫ్లైట్రాడార్24 వెల్లడించిన ప్రాథమిక ఏడీఎస్-బి డేటా ప్రకారం, ఏఐ171 విమానం గరిష్టంగా 625 అడుగులు బారోమెట్రిక్ ఎత్తుకు చేరుకున్నట్లు తెలిసింది. ఆ తర్వాత హఠాత్తుగా నిమిషానికి -475 అడుగుల వేగంతో కిందకు దిగడం ప్రారంభించిందని సమాచారం. బోయింగ్ 787 డ్రీమ్లైనర్ విమానం ఒక వైడ్బాడీ, రెండు ఇంజన్లు కలిగిన అత్యాధునిక విమానం. ఏవియేషన్ సేఫ్టీ నెట్వర్క్ డేటాబేస్ ప్రకారం, బోయింగ్ 787 రకం విమానానికి ప్రపంచ చరిత్రలో ఇదే మొట్టమొదటి ప్రమాదం కావడం గమనార్హం.