అక్షరటుడే, వెబ్డెస్క్ :Vemulawada Temple | వేములవాడ రాజన్న ఆలయాన్ని నిత్యం వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. స్వామి వారికి మొక్కులు చెల్లించుకొని తరిస్తారు. రాజరాజేశ్వర స్వామి(Rajarajeshwara Swamy) వారికి సమర్పించే మొక్కుల్లో కోడె మొక్కు(Kode Mokku) ప్రధానమైంది. ఎంతో మంది రాజన్నకు కోడెలు సమర్పించుకుంటారు. అయితే భక్తులు పవిత్రంగా చెల్లించుకునే కోడె మొక్కులపై అధికారులు పట్టించుకోవడం లేదు. భక్తులు సమర్పించిన కోడెల పర్యవేక్షణ లేకపోవడంతో అవి మృత్యువాత పడుతున్నాయి. రెండు రోజుల వ్యవధిలో 14 కోడెలు మృతి చెందాయి.
Vemulawada Temple | సౌకర్యాలు లేక..
స్వామి వారికి భక్తులు(Devotees) సమర్పించే కోడెలను తిప్పాపూర్ గోశాలకు అధికారులు తరలిస్తున్నారు. అయితే ఆ గోశాలలో 500 కోడెల సంరక్షణకు మాత్రమే అవకాశం ఉంది. కానీ అధికారులు అందులో 1200పైగా కోడెలను ఉంచారు. దీంతో వాటి మధ్య తొక్కిసలాటలు జరిగి చనిపోతున్నట్లు సమాచారం. శుక్రవారం 8 కోడెలు చనిపోగా.. శనివారం మరో ఆరు మృతి చెందాయి. పర్యవేక్షణ లేకపోవడంతో కోడెలు అనారోగ్యంతో బక్క చిక్కిపోతున్నాయి.కోడె మొక్కులతో ఆలయానికి రూ.కోట్ల ఆదాయం వస్తున్నా అధికారులు వాటిని పట్టించుకోకపోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోడెల మృత్యువాతపై స్పందించి కలెక్టర్ వెటర్నరీ వైద్య బృందాన్ని గోశాలకు పంపించారు.