అక్షరటుడే, వెబ్డెస్క్ : Phone Tapping Case | ఫోన్ ట్యాపింగ్ కేసు (Phone Tapping Case) నిందితుడు, ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావు (Prabhakar Rao)పై కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభాకర్ రావు మామూలోడు కాదని, ఆయనకు అమెరికాలో కేసీఆర్ కుటుంబంతో కౌన్సెలింగ్ అయిందన్నారు. అందులో భాగంగా పథకం ప్రకారమే విచారణకు హాజరయ్యాడని ఆరోపించారు. కాగా ఇటీవల మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అమెరికా (America)లో పర్యటించిన విషయం తెలిసిందే. ఆయన పర్యటన అనంతరం ప్రభాకర్ రావు హైదరాబాద్ చేరుకున్నారు. ఈ క్రమంలో సంజయ్ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
Phone Tapping Case | భార్యాభర్తల ఫోన్లు ట్యాప్ చేసిన నీచుడు
భార్యాభర్తల ఫోన్లు కూడా ట్యాప్ చేసిన నీచుడు ప్రభాకర్ రావు అని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన అనేక మంది కార్యకర్తల ఉసురు పోసుకున్నాడని ఆరోపించారు. పథకం ప్రకారమే ఆయన విచారణకు హాజరయ్యారని వ్యాఖ్యానించారు. ప్రభాకర్ రావు స్టేట్మెంట్ ను బహిరంగ పర్చాలని కేంద్ర మంత్రి డిమాండ్ చేశారు. ప్రభాకర్రావు వెనుక ఉన్న నిందితులకు శిక్ష పడాల్సిందే అని ఆయన అన్నారు.
బీఆర్ఎస్ (brs) హయాంలో ఎస్ఐబీ చీఫ్గా ఉన్న ప్రభాకర్రావు ప్రతిపక్ష పార్టీల నాయకులతో పాటు, సినీ ప్రముఖులు, జడ్జీలు, వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేశారు. ఈ మేరకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో గతేడాది మార్చిలో కేసు నమోదు అయింది. మరుసటి రోజు అమెరికా పారిపోయిన ప్రభాకర్రావు ఆదివారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. సోమవారం ఆయనను సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఈ క్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు.