అక్షరటుడే, వెబ్డెస్క్: Thiruchanur | తిరుపతి(Tirupati) సమీపంలోని తిరుచానూరులో ఓ కారులో ఇద్దరు యువకుల మృతదేహాలు లభించడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఉదంతం స్థానికంగా భయాందోళన కలిగించింది. తిరుచానూరు రంగనాథం వీధి(Ranganatham Street)లో రోడ్డుపక్కన అనుమానాస్పదంగా నిలిపివున్న కారుపై స్థానికుల దృష్టి పడింది. వారు దగ్గరకు వెళ్లి చూసినపుడు, కారులో ఇద్దరు యువకులు మృతి చెందినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కార్ డోర్ను ఓపెన్ చేసి మృతదేహాలను వెలికి తీశారు.
Thiruchanur | మద్యంలోనే మృత్యువు…
మృతుల్ని తిరుచానూరు(Thiruchanur)కు చెందిన వినయ్, దీలీప్ అని గుర్తించారు. ఇద్దరూ అన్నదమ్ములుగా సమాచారం. మృతదేహాలను పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే కారులో నాలుగు బీర్ బాటిళ్లు లభించాయి. మద్యం మత్తులో కారులో ఏసీ వేసుకొని అలానే పడుకొని ఉంటారని భావిస్తున్నారు. కారులో నిద్రిస్తున్న క్రమంలో పెట్రోల్ పూర్తిగా అయిపోవడంతో ఇంజిన్ ఆగిపోయి వారిద్దరూ ఊపిరి ఆడక చనిపోయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే కారు లోపల ఇద్దరు యువకుల మృతదేహాలు ఉండగా, బయట నుంచి పూర్తిగా కవర్ కప్పి ఉండడం స్థానికుల్లో అనేక అనుమానాలు కలిగిస్తుంది. యువకులు కారులో ఉండి మద్యం సేవించి పడుకున్నప్పటికీ.. బయట నుంచి కవర్ ఎవరు కప్పి ఉంటారనే విషయంలో పోలీసులు కూపీ లాగుతున్నారు.
యువకులు తామే కవర్ కప్పుకుని కారులోకి వెళ్లారా? లేక ఎవరైనా కవర్ వేసారా? అనే కోణంలో పోలీసులు(Thiruchanur police) విచారణ చేపట్టారు. స్థానికుల అభిప్రాయం ప్రకారం, యువకులు తాము తప్పించుకునేందుకు కారులో పడుకున్నా.. బయట నుంచి వారే కవర్ కప్పడం అసాధ్యమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఆత్మహత్యా? లేక పథకం ప్రకారం హత్యా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దుర్ఘటనకు గురైన కారు ఢిల్లీ రిజిస్ట్రేషన్కు చెందింది. పోలీసులు నంబర్ ఆధారంగా కారు వివరాలను తెలుసుకునే పనిలో ఉన్నారు. కారులో యువకులు చివరిసారిగా చేసిన కాల్స్, వారి మొబైల్ డేటా, సీసీటీవీ పుటేజీ ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనపై తిరుచానూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.