అక్షరటుడే, వెబ్డెస్క్ : Turmeric Board Office | జాతీయ పసుపు బోర్డు(Turmeric Board) కార్యాలయానికి ఎట్టకేలకు భవనం కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని కేటాయిస్తూ.. సర్కారు నిర్ణయం తీసుకుంది. దీంతో ఎట్టకేలకు ఎంపీ అరవింద్ చేసిన ప్రయత్నాలు ఫలించాయి.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జాతీయ పసుపు బోర్డును ఎంపీ అర్వింద్ మంజూరు చేయించిన విషయం తెలిసిందే. కొద్ది నెలల క్రితం కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పసుపు బోర్డును ప్రారంభించారు. నిజామాబాద్ సమీపంలోని సుగంద ద్రవ్యాల బోర్డు కార్యాలయంలో పసుపు బోర్డు కార్యాకలాపాలు కొనసాగించారు. అయితే అక్కడ వసతులు సరిగ్గా లేకపోవడంతో నిజామాబాద్లో భవనం కోసం చూశారు. ఖాళీగా ఉన్న రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం తమకు కేటాయించాలని పసుపు బోర్డు తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. మూడు నెలలుగా ఎలాంటి స్పందన లేదు. చివరకు ఎంపీ అరవింద్ రంగంలోకి దిగి మంత్రి కోమటిరెడ్డితో నేరుగా మాట్లాడారు. ఆ తర్వాత కొద్ది గంటల్లోనే ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వెలువడడం విశేషం.
Turmeric Board | ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కేటాయింపు
నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం(Rural MLA Camp office) నగరంలోని వినాయక్ నగర్లో ఉంది. అయితే రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి(Rural Mla Bhupati Reddy) దీనిని వినియోగించడం లేదు. దీంతో ఈ భవనం కొద్ది రోజులుగా ఖాళీగా ఉంది. ఈ క్రమంలో ఈ భవనాన్ని జాతీయ పసుపు బోర్డు కార్యాలయానికి కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నెలకు రూ.52 వేల అద్దెకు దీనిని కేటాయిస్తున్నట్లు అధికారులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Turmeric Board | ఎంపీ అర్వింద్ చొరవ
తాను ఎన్నికల్లో గెలిస్తే పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తానని ఎంపీ అర్వింద్(MP Arvind) హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన రెండో సారి ఎంపీగా గెలిచిన అనంతరం కేంద్ర మంత్రులతో అనేక సార్లు సమావేశం అయి పసుపు బోర్డు కోసం ప్రయత్నించారు. స్వయంగా ప్రధాని మోదీతో పసుపు బోర్డు ఏర్పాటుపై ప్రకటన చేయించారు. రాష్ట్రంలో పసుపు ఎక్కువగా సాగు చేసే నిజామాబాద్ జిల్లాలోనే కార్యాలయం ఉండేలా ఆయన చొరవ చూపారు. అంతేగాకుండా ఆర్మూర్ నియోజకవర్గానికి చెందిన పల్లె గంగారెడ్డిని జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్గా నియమింపజేశారు.
పసుపు బోర్డు ఏర్పాటు చేసినా.. దానికి ప్రత్యేక భవనం లేకపోవడంతో ఎంపీ అర్వింద్ రాష్ట్ర ప్రభుత్వానికి పలుమార్లు వినతి పత్రం అందించారు. మూడు నెలలుగా భవనం కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి(Minister Komatireddy )తో మాట్లాడి ఖాళీగా ఉంటున్న రూరల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని పసుపు బోర్డు కోసం కేటాయించేలా ప్రత్యేక చొరవ చూపారు.
Turmeric Board | రైతులకు ప్రయోజనం
పసుపు బోర్డు విశాలమైన ప్రాంగణంలో ఉంటే రైతులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న కార్యాలయంలో సరైన వసతులు లేవు. ప్రస్తుతం క్యాంపు కార్యాలయంలో బోర్డు ఛైర్మన్, కార్యదర్శికి ప్రత్యేక గదులు కేటాయించనున్నారు. అంతేగాకుండా రైతులు, వ్యాపారులతో సమావేశం కోసం ఏర్పాట్లు చేసే అవకాశం ఉంది. దీంతో పసుపు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.