అక్షరటుడే, వెబ్డెస్క్:Donald Trump | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ విదేశీ విద్యార్థులకు (Foreign Students) మరో షాక్ ఇచ్చారు. రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి విదేశీ విద్యార్థులు, అక్రమ వలసదారుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే స్టూడెంట్ వీసా(Student visa)ల జారీని తాత్కాలికంగా నిలిపివేసిన అమెరికా ప్రభుత్వం తాజాగా.. మరో షాక్ ఇచ్చింది.
అమెరికా(America)లో ఎంతో ప్రసిద్ధి చెందిన హార్వర్డ్ యూనివర్సిటీ(Harvard University)లో చదివేందుకు ఎంతో మంది ఏళ్లుగా ప్రయత్నాలు చేస్తుంటారు. విదేశాల్లోని విద్యార్థులు ఈ యూనివర్సిటీలో ప్రవేశాల కోసం పోటీ పడతారు. అయితే ట్రంప్ ప్రభుత్వం తాజాగా హార్వర్డ్ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థులకు ప్రవేశాన్ని రద్దు చేసింది. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది.
Donald Trump | జాతీయ భద్రత కోసం..
హార్వర్డ్ యూనివర్సిటీ విదేశీ విద్యార్థులకు సంబంధించిన సమాచారాన్ని సరిగా తమకు నివేదించడం లేదని ప్రభుత్వం పేర్కొంది. ముగ్గురు విద్యార్థుల సమాచారంలో లోపాలు ఉన్నట్లు గుర్తించామని తెలిపింది. దీంతో జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థుల ప్రవేశాలు నిలిపి వేస్తున్నట్లు ప్రకటించింది.
Donald Trump | ఆందోళనలో విద్యార్థులు
అమెరికాలో చదువుకోవాలని ఎంతో మంది విదేశీ విద్యార్థులు కలలు కంటారు. ముఖ్యంగా భారత్కు చెందిన యూఎస్లో చదవాలని కాంక్షిస్తారు. అలాంటి ఆశలపై ట్రంప్ నీళ్లు పోస్తున్నారు. దీంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ట్రంప్ ప్రభుత్వం వారం క్రితం స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూలను తాత్కాలికంగా నిలిపి వేసింది. ‘సోషల్ మీడియా వెట్టింగ్’ (Social media vetting) ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఇంటర్వ్యూలు నిర్వహించాలని నిర్ణయించింది.
Donald Trump | సోషల్ మీడియా వెట్టింగ్ అంటే..
అమెరికాలో చదువుకోవడానికి దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల సోషల్ మీడియా ఖాతాలను ముందుగా తనిఖీ చేయనున్నారు. ఈ ప్రక్రియను సోషల్ మీడిమా వెట్టింగ్ అంటారు. విద్యార్థుల సోషల్ మీడియా అకౌంట్లపై అధికారులు నిఘా పెడతారు. అనంతరం అమెరికా(America)కు వ్యతిరేకంగా ఎలాంటి పోస్టులు లేకుంటే వారికి వీసా మంజూరు చేస్తారు. అమెరికా వ్యతిరేక పోస్టులు ఉంటే.. సదరు విద్యార్థి వీసాను రిజెక్ట్ చేస్తారు. ఏదేమైనా ట్రంప్ తీసుకుంటున్న వరుస నిర్ణయాలు విదేశీ విద్యార్థులను కలవర పెడుతున్నాయి. ప్రత్యేకించి సింహభాగం విదేశీ విద్యార్థులు భారతీయులే. అందులోనూ ఉభయ తెలుగు రాష్ట్రాల వారే ఎక్కువ. ఇప్పుడు వారందరిలో ట్రంప్ నిర్ణయాలు ఆందోళన పుట్టిస్తున్నాయి.