అక్షరటుడే, వెబ్డెస్క్: Trump | కెనడా పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi)ని అమెరికాకు రావాలని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఆహ్వానించారు. అయితే, ఈ ఆహ్వానాన్ని ప్రధాని సున్నితంగా తిరస్కరించారు. ముందస్తు షెడ్యూల్ కారణంగా ఇప్పుడు రాలేకపోతున్నానని తెలిపారు. ఈ నేపథ్యంలో సమీప భవిష్యత్తులో కలవడానికి ప్రయత్నించాలని ఇరువురు నాయకులు నిర్ణయించారు.
ఈ విషయాన్ని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ (Foreign Secretary Vikram Misri) బుధవారం వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేశారని, దాదాపు 35 నిమిషాల పాటు వారి మధ్య సంభాషణ జరిగిందని తెలిపారు. “కెనడా నుంచి తిరిగి వస్తున్నప్పుడు అమెరికా(America)లో ఆగుతారా అని ప్రధాని మోదీని అధ్యక్షుడు ట్రంప్ అడిగారు. ముందస్తు షెడ్యూల్ కారణంగా రాలేనని ప్రధాని బదులిచ్చారు. సమీప భవిష్యత్తులో కలవడానికి ప్రయత్నించాలని ఇద్దరు నాయకులు నిర్ణయించుకున్నారని చెప్పారు. వాస్తవానికి జి7 శిఖరాగ్ర సమావేశం(G7 summit)లో ఇద్దరు నాయకులు సమావేశం కావాల్సి ఉందని, కానీ అధ్యక్షుడు ట్రంప్ కెనడాలో జరిగే శిఖరాగ్ర సమావేశం నుంచి హుటాహుటిగా వెళ్లాల్సి రావడంతో భేటీ జరగలేదని మిస్రీ అన్నారు.
Trump | మధ్యవర్తిత్వాన్ని అంగీకరించమన్న మోదీ..
ట్రంప్తో మోదీ సంభాషణ సందర్భంగా ఆపరేషన్ సిందూర్(Operation Sindoor) గురంచి చర్చ జరిగిందని మిస్రీ తెలిపారు. కశ్మీర్ అంశంలో మధ్యవర్తి ప్రమేయాన్ని అంగీకరించేది లేదన్న భారత వైఖరిని ప్రధాని పునరుద్ఘాటించారని చెప్పారు. ప్రధాని మోదీ ఆపరేషన్ సిందూర్ గురించి ట్రంప్కు వివరించారు. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో వాణిజ్యానికి సంబంధించిన ఏ అంశాలను చర్చించలేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారన్నారు. “భారతదేశం ఎప్పుడూ మూడో పక్షం మధ్యవర్తిత్వాన్ని అంగీకరించలేదని, భవిష్యత్తులో అలాంటి మధ్యవర్తిత్వాన్ని అంగీకరించదని కూడా ప్రధాని పునరుద్ఘాటించారు” అని మిస్రీ అన్నారు. భారతదేశం-అమెరికా వాణిజ్య ఒప్పందం గురించి లేదా ఆపరేషన్ సిందూర్కు సంబంధించి భారత్-పాక్ మధ్య అమెరికా మధ్యవర్తిత్వం గురించి ఎటువంటి చర్చ జరగలేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారని తెలిపారు. ఇండియా ఇప్పుడు ఉగ్రవాద చర్యలను ప్రాక్సీ చర్యలుగా కాకుండా యుద్ధ చర్యలుగా పరిగణిస్తుందని ప్రధాని మోదీ నొక్కి చెప్పారని విదేశాంగ కార్యదర్శి వివరించారు.