అక్షరటుడే, వెబ్డెస్క్: Jagannath Rath Yatra : ఒడిశా (Odisha)లో విషాదం చోటుచేసుకుంది. పూరీ జగన్నాథ రథయాత్ర(Puri Jagannath Rath Yatra)లో మరోసారి అపశృతి జరిగింది. ఆదివారం(జూన్ 29) తెల్లవారుజామున తొక్కిసలాట జరిగి, ముగ్గురు భక్తులు దుర్మరణం చెందారు. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
తొక్కిసలాటలో మరణించిన వారిని ప్రేమకాంత మొహంతి(80), బసంతి సాహు(36), ప్రభాతి దాస్(42)గా గుర్తించారు. మృతదేహాలను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలిలో నెలకొన్న పరిస్థితిని చక్కదిద్దారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకుంటున్నారు.
Jagannath Rath Yatra : ఇటీవలే అహ్మదాబాద్లో..
ఇటీవల అహ్మదాబాద్ రథయాత్రలో ఊరేగింపుగా వచ్చిన మూడు ఏనుగులు అదుపుతప్పి ఒక్కసారిగా భక్తుల పైకి దూసుకురావడంతో తోపులాట చోటుచేసుకుంది. భారీ ఏనుగులు దూసుకురావడంతో భయాందోళనకు గురైన భక్తులు పరుగులు తీయడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. ఈ ఘటన మరువకముందే మరోటి చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. కాగా.. పూరి రథయాత్ర కోసం దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. దీంతో పూరి ప్రాంత పరిసరాలు కోలాహలంగా మారాయి.