అక్షరటుడే, వెబ్డెస్క్: India – US | అమెరికాతో ప్రతిపాదిత వాణిజ్య ఒప్పందం ఖరారుపై పీఠముడి పడింది. ప్రధానంగా వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులపై రెండు దేశాలు పట్టు వీడకపోవడంతో సందిగ్ధత నెలకొంది. మొక్కజొన్న, సోయాబీన్ వంటి వ్యవసాయ ఉత్పత్తులను తక్కువ సుంకాలతో దిగుమతి చేసుకోవడానికి అనుమతించాలని అమెరికా(America) పట్టుబడుతుండగా, అందుకు ఇండియా(India) నిరాకరిస్తోంది. అమెరికా చెప్పినట్లు అంగీకరిస్తే అది మన రైతులపై గణనీయమైన ప్రతికూల ప్రభావం చూపుతుంది. జన్యుపరంగా మార్పు చేసిన ఆహారంతో సంబంధం ఉన్న ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందన్న భయాందోళన నెలకొంది. ఈ నేపథ్యంలోనే వాణిజ్య ఒప్పందంపై జరుగుతున్న చర్చలు తుది దశకు చేరడం లేదని సంబంధిత వర్గాలు తెలిపాయి.
India – US | ఒప్పందం ఖరారు కాకుంటే సుంకాల మోత
అమెరికా అధ్యక్షుడిగా రెండో సారి బాధ్యతలు చేపట్టిన ట్రంప్(Donald Trump).. ప్రపంచ దేశాలపై సుంకాల మోత మోగించారు. తమ దేశం దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై కనీసం 10 శాతం నుంచి 33 శాతం వరకు పెంచేశారు. ప్రధానంగా ఇండియాను అత్యంత అధిక పన్నులు విధించే దేశంగా పేర్కొంటూ మనపై 26 శాతం టాక్స్ పెంచారు. అయితే, ట్రంప్ నిర్ణయం గ్లోబల్ మార్కెట్లతో(Global Markets) పాటు వాణిజ్య సంబంధాలపై పెను ప్రభావం చూపుతుండడంతో ఆయన కాస్త వెనక్కి తగ్గారు. తమపై విధిస్తున్న పన్నులను సరళీకరించాలని ఆయా దేశాలకు అవకాశమిస్తూ, ఇందుకోసం నిర్దేశిత గడువు విధించారు. ఇండియా కూడా జూలై 9 నాటికి అమెరికాతో ఒప్పందం చేసుకోవాల్సి ఉంది. లేకపోతే మన దేశ ఎగుమతులపై 26 శాతం టాక్స్ తప్పదు.
India – US | వ్యవసాయ ఉత్పత్తులపై అమెరికా పట్టు
వాణిజ్య ఒప్పందం(Trade Agreement) ఖరారుపై రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. అయితే, వ్యవసాయ ఉత్పత్తులు, జన్యుమార్పిడి ఆహారంపై తక్కువ సుంకాలను విధించాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. దీన్ని భారత్ వ్యతిరేకిస్తుండడంతో వాణిజ్య ఒప్పందం ఖరారుకు అడ్డంకులు తలెత్తాయి. చర్చల ప్రారంభంలో వస్త్రాలు, తోలు వస్తువులు, ఔషధాలు, కొన్ని ఇంజనీరింగ్ వస్తువులు, ఆటో విడిభాగాలు వంటి భారతదేశ ప్రయోజనాలకు సంబంధించిన అనేక ఉత్పత్తులకు జీరో డ్యూటీ యాక్సెస్(Zero Duty Access) లభిస్తుందని ప్రభుత్వం ఆశించింది. కానీ అమెరికా ప్రభుత్వం(US government) అందుకు నిరాకరించింది.