అక్షరటుడే, వెబ్డెస్క్: Rajasthan | రాజస్థాన్లో మహాభారత కాలం నాటి ఆనవాళ్లు బయటపడ్డాయి. భారత పురావస్తు శాఖ(ఏఎస్ఐ) చేపట్టిన తవ్వకాల్లో కీలక అంశాలు వెలుగు చూశాయి. దీగ్ జిల్లాలోని బహాజ్ గ్రామం(Bahaj Village)లో పురావస్తు శాఖ 2024 జనవరి 10 నుంచి తవ్వకాలు చేపట్టింది. 23 మీటర్ల లోతు వరకు తవ్వకాలు చేపట్టగా, నమ్మశక్యం కాని ఆధారాలు లభ్యమయ్యాయి. 4,500 ఏళ్ల నాటి పురాతన నాగరికతకు సంబంధించిన ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. రుగ్వేదంలో ప్రస్తావించిన పౌరాణిక సరస్వతి నది ప్రవాహమని పురావస్తు శాస్త్రవేత్తలు(Archaeologists) అంచనా వేస్తున్నారు. 23 మీటర్ల లోతైన పాలియో-చానల్తో సహా అనేక ముఖ్యమైన విషయాలు బయటపడ్డాయి. మహాభారత కాలం నాటి ఆధారాలు అనేకం లభ్యమయ్యాయి.
Rajasthan | 800లకు పైగా కళాఖండాలు లభ్యం..
పురావస్తు తవ్వకాల్లో 800లకు పైగా కళాఖండాలు లభ్యమయ్యాయి. మహాభారత కాలం(Mahabharata period) నాటి యజ్ఞ కుండాలు, మట్టిపాత్రలు, వాటిపై ఉన్న చిత్రాలు ఆనాటి పరిస్థితులను కళ్లకు కడుతున్నాయని అధికారులు చెబుతున్నారు. బ్రాహ్మీ లిపి(Brahmi Lipi) ముద్రలు, శివపార్వతుల విగ్రహాలతో(Shiva and Parvati Idols) పాటు ఎముకలతో చేసిన పనిముట్లు, సూదులు, దువ్వెనలు, అచ్చులు, రాగి నాణేలు ఇక్కడి తవ్వకాల్లో బయటపడడం విశేషం. కుండలు, యజ్ఞ కుండ్(Yajna Kund), మౌర్యుల కాలం నాటి శిల్పాలు, ఎముకలతో చేసిన ఉపకరణాలు ఉన్నాయి.
Rajasthan | నదీప్రవాహ మార్గం..
బహాజ్ గ్రామంలో బయటపడిన నదీ ప్రవాహ మార్గం సరస్వతీ నదీ వ్యవస్థలో భాగమై ఉండొచ్చునని పురావస్తు శాస్త్రవేత్తలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ పురాతన నదీ వ్యవస్థ బహుశా ప్రారంభ మానవ స్థావరాలకు మద్దతు ఇచ్చింది మరియు బహాజ్ను పెద్ద సరస్వతి బేసిన్ సంస్కృతికి అనుసంధానించి ఉంటుందని భావిస్తున్నారు. ఇక్కడే తొలినాటి మానవ ఆవాసాలు ఏర్పడి ఉండొచ్చని భావిస్తున్నారు. మధుర, బ్రజ్ ప్రాంతాలతో ఈ నాగరికత సాంస్కృతిక సంబంధాలు కొనసాగించి ఉండొచ్చునని భారత పురావస్తు శాఖ సైట్ హెడ్ పవన్ సారస్వత్(Pawan Saraswat) పేర్కొన్నారు. సుమారు 23 మీటర్ల లోతు వరకు జరిపిన తవ్వకాలు రాజస్థాన్ చరిత్రలోనే అత్యంత లోతైనవిగా పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
Rajasthan | సాంస్కృతిక వారసత్వ కేంద్రం..
బహాజ్ గ్రామంలో జరిపిన తవ్వకాలు ప్రాచీన చరిత్ర అధ్యయనానికి కొత్త దిశానిర్దేశం చేస్తున్నాయని పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒకే ప్రదేశంలో హరప్పా తర్వాతి కాలం, మహాభారత కాలం, మౌర్యుల కాలం, కుషాణుల కాలం, గుప్తుల కాలం.. ఇలా ఐదు వేర్వేరు చారిత్రక కాలాలకు సంబంధించిన ఆధారాలు బయటపడడం అద్భుతమని పేర్కొంటున్నారు.
Rajasthan | అస్తిపంజరం లభ్యం..
మహాభారత కాలం నాటి కుండలు, హవన్ కుండ్లతో పొరలు బయటపడ్డాయి. వీటిలో దీర్ఘచతురస్రాకార, వృత్తాకార చిత్రాలు, అగ్ని ఆచారాల అవశేషాలు ఉన్నాయి. కుండలు మహాభారత కాలం నాటి దుస్తులు, పాత్రల వర్ణనలతో సరిపోలుతున్నాయని అధికారులు తెలిపారు. ఈ ప్రదేశంలో మౌర్య మాతృదేవత అధిపతి అని నమ్ముతున్న క్రీస్తుపూర్వం 400 నాటి విగ్రహం లభించిందని పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గుప్తుల నిర్మాణ శైలికి చెందిన మట్టి గోడలు, స్తంభాలు, లోహశాస్త్రానికి సంబంధించిన కొలిమిలు లభించడం భారత పురావస్తు చరిత్రకు కొత్త మార్గనిర్దేశనం చేసిందని పేర్కొంటున్నారు. తవ్వకాల సమయంలో ఒక మానవ అస్థిపంజరం కూడా లభ్యం కాగా, దీనిని పరీక్ష కోసం ఇజ్రాయెల్(Israel) కు పంపించారు.