అక్షరటుడే, వెబ్డెస్క్: Mumbai rains : ముంబయిలో కుండపోత వర్షాలు జన జీవనాన్ని స్తంభింపజేస్తున్నాయి. నిన్నటి నుంచి ఇప్పటివరకు 200 మి.మీ. వర్షపాతం నమోదైంది. గురువారం (జూన్ 19) భారత వాతావరణ శాఖ(ndia Meteorological Department) ఆరెంజ్ అలర్ట్(orange alert) జారీ చేసింది. ఈ నేపథ్యంలో దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది.

ముంబయి, పరిసర ప్రాంతాల ప్రజలు అత్యవసరమయితే తప్ప బయటకు రావద్దని వాతావరణ శాఖ సూచించింది. లోతట్టు ప్రాంతాల్లో నీటి మట్టం పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

జూన్ 19న మేఘావృతమైన ఆకాశంతో పాటు భారీ వర్షాలు కురుస్తాయని భావిస్తున్నారు. జూన్ 20న పరిస్థితులు కొద్దిగా తగ్గుతాయని చెబుతున్నారు. మోస్తరు వర్షాలు ఉండే అవకాశం ఉంది. జూన్ 21, 22 తేదీలలో అడపాదడపా వర్షాలు కురుస్తాయి. జూన్ 23, 24 తేదీలలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఇక గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల(heavy rains)తో బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (Brihanmumbai Municipal Corporation) నిర్వహించే కృత్రిమ జలాశయం అయిన పోవాయి సరస్సు(Powai Lake) పొంగి పొర్లుతోంది. 545 కోట్ల లీటర్ల (5.45 బిలియన్ లీటర్లు) నిల్వ సామర్థ్యం కలిగిన ఈ సరస్సు బుధవారం ఉదయం 6 గంటల ప్రాంతంలోనే పొంగి ప్రవహించడం ప్రారంభించిందని, నీటి మట్టం 195.10 అడుగులకు చేరుకుందని BMC వెల్లడించింది.