అక్షరటుడే, వెబ్డెస్క్:Cabinet Meeting | తెలంగాణ మంత్రివర్గ సమావేశం గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (Chief Minister Revanth Reddy) అధ్యక్షతన జరగనుంది. రాష్ట్ర సచివాలయంలో మధ్యాహ్నం మూడు గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. రైతు భరోసా(Raithu Bharosa), బనకచర్ల ప్రాజెక్ట్ (Banakacharla Project), కాళేశ్వరంపై ఎన్డీఎస్ఏ నివేదిక, ఉద్యోగుల సమస్యలపై మంత్రివర్గంలో చర్చించనున్నారు.
Cabinet Meeting | అన్నదాతల నిరీక్షణ
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ఒక విడత రైతు భరోసా జమ చేయలేదు. గత యాసంగి సీజన్కు ఎకరాకు రూ.6 వేల చొప్పున జమ చేస్తామని ప్రకటించింది. కానీ అందరి రైతుల ఖాతాల్లో నగదు జమ కాలేదు. నాలుగు ఎకరాల్లోపు రైతులకు మాత్రమే రైతు భరోసా జమ అయింది. మిగతా వారికి జమ కాకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఓ వైపు వానాకాలం సాగు సీజన్ ప్రారంభం అయినా.. యాసంగి పెట్టుబడి సాయం అందకపోవడంపై రైతులు (Farmers) ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజా మంత్రివర్గ సమావేశంలో వానాకాలం రైతు భరోసా గురించి ప్రకటన చేస్తారని రైతులు ఆశిస్తున్నారు. ఈ సీజన్లోనైనా సకాలంలో పెట్టుబడి సాయం అందించాలని కోరుతున్నారు. రైతు భరోసా ఆలస్యంగా జమ చేస్తుండటంతో పంట పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నట్లు వాపోతున్నారు.
Cabinet Meeting | బనకచర్లపై ఎలా ముందుకు..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(Andhra Pradesh Government) బనకచర్ల ప్రాజెక్ట్ నిర్మిస్తోంది. దీంతో గోదావరి జలాలను ఏపీ తరలించుకు పోతుందని బీఆర్ఎస్(BRS) ఆరోపిస్తోంది. మన జలాలు ఎక్కువగా వినియోగిస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. వెంటనే ప్రాజెక్ట్ నిర్మాణాన్ని అడ్డుకోవాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్పై సమావేశంలో చర్చించి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయనున్నట్లు సమాచారం.
Cabinet Meeting | ఉద్యోగుల సమస్యలపై..
రాష్ట్రంలో ఉద్యోగులు కొంతకాలంగా తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. పెండింగ్లో ఉన్న డీఏ(DA)లు విడుదల చేయాలని, పీఆర్సీ ప్రకటించాలని కోరుతున్నారు. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన మంత్రివర్గ ఉపసంఘంతో కలిసి ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశం అయ్యారు. ఈ రోజు జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి ఉద్యోగులకు ఒక డీఏ ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. అలాగే.. త్వరలో లోకల్ బాడీ ఎన్నికలు జరిపేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ ఎనికలు దృష్టిలో ఉంచుకుని పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.