అక్షరటుడే, వెబ్డెస్క్: Yogini Ekadashi : హిందువులు (Hindus) ఏకాదశిని పవిత్రమైన తిథిగా భావిస్తారు. ప్రతి నెల శుక్ల పక్షం(Shukla Paksha)లో ఒక ఏకాదశి, కృష్ణ పక్షం(Krishna Paksha)లో మరొక ఏకాదశి వస్తుంది. ఇలా వచ్చే వాటిల్లో కొన్నింటికి ప్రత్యేకత ఉంటుంది. అలాంటి వాటిల్లో మరింత స్పెషల్ “యోగినీ ఏకాదశి”. ఏటా జ్యేష్ట మాసం కృష్ణ పక్షంలో ఇది వస్తుంది.
శనివారం(జూన్ 21) యోగినీ ఏకాదశి అని వేద పండితులు చెబుతున్నారు. జ్యేష్ట మాసం బహుళ పక్షంలో వచ్చే ఈ ఏకాదశి రోజున పసుపు రంగు వస్త్రాలు ధరించి విష్ణుమూర్తిని పూజిస్తే.. విశేష ఫలితాలు కలుగుతాయని పేర్కొంటున్నారు.
Yogini Ekadashi : ఈ రోజు ఏం చేయాలంటే..
తెల్లవారుజామున నిద్రలేచి ఇంటిని, పూజ గదిని శుభ్రం చేయాలి. పూజ గదిలో విష్ణుమూర్తి విగ్రహం ఉంచి పూజ చేయాలి. ముందుగా స్వామి వారి విగ్రహానికి పంచామృతాలు, గంగాజలంతో అభిషేకాలు చేయాలి. అనంతరం స్వామివారిని పసుపు రంగు పుష్పాలతో పూజించాలి. ఇలా పూజ చేస్తూ “ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ” అనే మంత్రాలు జపిస్తే.. సాక్ష్యాత్తు విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుందనేది ఉవాచ.
అనంతరం స్వామి వారి విగ్రహం ఎదుట దీపం వెలిగించి, 21 సార్లు విష్ణు గాయత్రి మంత్రం జపిస్తే.. మంచిదని పండితుల మాట. “ఓం శ్రీ విష్ణువే చ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్” అనేది విష్ణు గాయత్రి మంత్రం.
ఇలా యోగినీ ఏకాదశి నాడు విష్ణుమూర్తిని పూజిస్తే.. స్వామి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుందని, వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో రాణించవచ్చని వేద పండితులు పేర్కొంటున్నారు. విగ్రహం లేనివారు స్వామి చిత్రపటానికి గంధం, కుంకుమ బొట్లు పెట్టి పసుపు రంగు పుష్పాలతో పూజ చేసి దీపం వెలిగిస్తే.. మంచిదని చెబుతున్నారు.