అక్షరటుడే, వెబ్డెస్క్: Yoga Day : మన దేశ పురాతన సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అయిన యోగా(Yoga).. ప్రపంచవ్యాప్తంగా ఆదరణను చూరగొంది. నిత్య జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. ఇది శారీరక, మానసిక, ఆధ్యాత్మిక(Devotional) శ్రేయస్సును కలిగించే అద్భుతమైన ప్రక్రియ. శరీరం, మనసు మధ్య సమతుల్యతను సాధించడంలో సహాయపడుతుంది. ఒత్తిడి, ఆందోళనను దూరం చేయడంతోపాటు ఆరోగ్యకర జీవితానికి బాటలు వేస్తుంది. శారీరక దృఢత్వం(Physical fitness), మానసిక ప్రశాంతత(Peace of mind)ను కలిగించడంతోపాటు జ్ఞాపకశక్తి, క్రమశిక్షణ, రోగనిరోధక శక్తిని పెంచడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని యోగా గురువులు పేర్కొంటున్నారు.
Yoga Day : 2014 నుంచి మరింత ప్రాచుర్యం..

ఐదు వేలకుపైగా సంవత్సరాల చరిత్ర కలిగిన యోగా.. బాబా రాందేవ్ (Baba Ramdev) వంటి గురువుల వల్ల మరింత ప్రాచుర్యాన్ని పొందింది. నరేంద్రమోదీ(Narendra Modi) ప్రధానమంత్రి అయ్యాక ప్రపంచవ్యాప్తంగా అందరి జీవితాల్లోనూ యోగాను భాగం చేయడానికి చర్యలు తీసుకున్నారు. 2014 సెప్టెంబరు 27న ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ఆయన అంతర్జాతీయ యోగా డే(International Yoga Day)ను ప్రతిపాదించారు. ఈ తీర్మానానికి 177 మంది ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు మద్దతు ఇవ్వడంతో 2015 జూన్ 21 నుంచి యోగా డే అమలులోకి వచ్చింది.
ప్రస్తుత సంవత్సరం ‘యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్’ అనే ఇతివృత్తంతో యోగా దినోత్సవం జరుపుకొంటున్నాం. ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం (Visakhapatnam)లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి అక్కడి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి(Prime minister) నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారు. 26 కిలోమీటర్ల విస్తీర్ణంలో 5 లక్షల మందితో యోగాసనాలు నిర్వహించి రెండు గిన్నిస్ రికార్డులను సృష్టించే లక్ష్యంతో ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలోనూ ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు.
Yoga Day : 170కిపైగా దేశాల్లో..
2015లో ప్రారంభించిన తొలి అంతర్జాతీయ యోగా దినోత్సవంలో 84 దేశాలు పాల్గొన్నాయి. ప్రస్తుతం 170 కిపైగా దేశాలు భాగమయ్యాయి. ముస్లిం దేశాలలోనూ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 8 లక్షల ప్రాంతాలలో అంతర్జాతీయ యోగా డే నిర్వహిస్తున్నారంటే మన యోగాకు ఏ స్థాయిలో ప్రాధాన్యం ఉందో అర్థం చేసుకోవచ్చు.
కాగా, 2023లో గుజరాత్ రాష్ట్రంలోని సూరత్(Surat)లో ఒకే వేదికపై 1.53 లక్షల మంది యోగా డేలో పాల్గొని గిన్నిస్ రికార్డ్ సృష్టించారు. ఈసారి ఆ రికార్డులను అధిగమించాలన్న లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్టం ఏర్పాట్లు చేస్తోంది. అలాగే దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో యోగా డే ను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాటు చేస్తున్నారు.