అక్షరటుడే, వెబ్డెస్క్: Hydraa | హైదరాబాద్ (Hyderabad) నగరంలో చెరువులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం ప్రభుత్వం హైడ్రా (Hydraa)ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. చెరువులు, నాలాలు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది.
వర్షాకాలం కావడంతో ప్రస్తుతం నాలాల ఆక్రమణలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ (Hydra Commissioner Ranganath) ప్రత్యేక దృష్టి పెట్టారు. వరద నీరు సాఫీగా వెళ్లడానికి నాలాలపై ఆక్రమణలను తొలగించాలని ఆయన ఆదేశించారు. హైడ్రా అధికారుల చర్యలతో ఆక్రమణలకు పాల్పడిన వారు హడలిపోతున్నారు. ఈ క్రమంలో హైడ్రా పేరు చెప్పి పలువురు బెదిరింపులకు పాల్పడుతున్నారు. నిర్మాణాలు చేపడుతున్న వారి దగ్గరకు వెళ్లి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు.
తాజాగా హైడ్రా పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్న ఇద్దరిపై పోలీసులు (Police) కేసు నమోదు చేశారు. అల్కాపురి టౌన్షిప్ (Alkapuri Township)లో నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్లి మిరియాల వేదాంతం, యెలిశెట్టి శోభన్బాబు అనే వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. హైడ్రా పేరుతో బెదిరింపులకు పాల్పడుతుండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. హైడ్రా పేరు చెప్పి ఎవరైనా బెదిరిస్తే 87124 06899కి సమాచారం ఇవ్వాలి కోరారు.