అక్షరటుడే, వెబ్డెస్క్ : Harish Rao | రాష్ట్రంలో ఉన్నది రైతు రాజ్యం కాదని, కేడీల రాజ్యమని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. అధికారం కోసం ఎన్నెన్నో కోతలు కోసిన రేవంత్ రెడ్డి గద్దెనెక్కాక ఒక్కటి కూడా అమలు చేయట్లేదని మండిపడ్డారు. రైతులకు రైతు భరోసా (Rythu Bharosa) ఇచ్చే వరకు ఆయనను కోతల రేవంత్ అనే పిలుస్తామన్నారు. రైతుభరోసా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డి జిల్లా (Sangareddy District) జిన్నారంలో నిర్వహించిన రైతు ధర్నాలో (rythu Dharna) హరీశ్ రావు మాట్లాడారు. కేసీఆర్ ఉన్నప్పుడు నాట్లకు నాట్లకు మధ్య రైతు బంధు వచ్చేదని, రేవంత్ రెడ్డి (revanth reddy) వచ్చాక ఓట్లకు, ఓట్లకు మధ్య రైతు భరోసా వస్తుందని ఎద్దేవా చేశారు. మధ్యలో ఓట్లు లేకపోవడంతో రెండు సార్లు రైతు భరోసా ఎగ్గొట్టారని విమర్శించారు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు పటాన్ చెరు నియోజకవవర్గంలో 2 లక్షల మంది రైతులకు సీఎం రేవంత్ (CM Revanth Reddy) అన్యాయం చేశారని మండిపడ్డారు.
రుణమాఫీ విషయంలోనూ కాంగ్రెస్ (Congress) మాట తప్పి రైతులను మోసం చేసిందని మండిపడ్డారు. గతేడాది 15 ఆగస్టులోపు రుణమాఫీ చేస్తానని అందరు దేవుళ్లపై రేవంత్ రెడ్డి ఒట్టు పెట్టాడని, చివరకు దేవుళ్లను కూడా మోసం చేసిండన్నారు. రుణమాఫీ (Runamafi) చేసింది 40 శాతం.. ఎగ్గొట్టింది 60 శాతమని పేర్కొన్నారు. రుణమాఫీ ఎందుకు చేయలేదో సీఎం రేవంత్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దేవుడిపై ఓట్టు వేసి మాట తప్పిన సీఎం రేవంత్ రెడ్డికి అసెంబ్లీ ఓ లెక్కనా? అని ప్రశ్నించారు. ఆరు నెలల నుంచి వేలాది మంది రైతుల కుటుంబాలకు (Farmers Familys) రైతుబీమా రావడం లేదన్నారు. రేవంత్ అబద్ధాల ముఖ్యమంత్రి అని విమర్శించారు.
Harish Rao | రైతులకు బేడీలా?
మా భూమి లాక్కోవద్దు అంటే లగచర్ల, పెద్ద ధర్మారం రైతులకు బేడీలు వేసి జైలుకు పంపిన చరిత్ర రేవంత్ రెడ్డిదని హరీశ్ రావు విమర్శించారు. రాష్ట్రంలో రైతు రాజ్యం కాదు కేడీలా రాజ్యం, బేడీలా రాజ్యం నడుస్తుందన్నారు. న్యాయం చేయమని అడిగితే రైతులకు బేడీలు వేస్తారా ? అని ప్రశ్నించారు. రైతు భరోసా రాని రైతులు ఔటర్ రింగ్ రోడ్డును (Outer Ring Road) ముట్టడిస్తే సీఎం దిగి రావాల్సిందేనన్నారు. గత నెలలో సీఎం రేవంత్ జహీరాబాద్ (Zaherabad) వస్తే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని తెలిపారు.
Harish Rao | కనీస అవగాహన లేదు..
రాష్ట్రంలో ఏ ప్రాజెక్టులు ఏ నది మీద ఉన్నాయి.. ఏ నది ఎక్కడి నుంచి వెళ్తుందన్న కనీస అవగాహన కూడా ముఖ్యమంత్రికి లేదని హరీశ్ ఎద్దేవా చేశారు. నల్లమల్ల ఎక్కడ ఉంది..? బనకచర్ల (Banakacharla) ఏ బేసిన్లో ఉంది అని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అడుగుతున్నారని, నీకు తెలియకపోతే సప్పుడు చేయకుండా కూర్చో.. కానీ తెలంగాణ రాష్ట్రం (Telangana State) ఇజ్జత్ తీయకు అని హితవు పలికారు. రేవంత్ రెడ్డికి పప్పు ధాన్యాలు, చిరు ధాన్యాలకు తేడా కూడా తెలియదన్నారు. ‘నేను పొడుగు ఉన్నా అని నా మీద సీఎం రేవంత్ పడ్డాడు. మరి నువ్ పొట్టిగా ఉన్నావ్ నేనేం చేయాలి. నిన్ను గుంజినా పెద్దగా కావు కదా ?’ అని సెటైర్ వేశారు.
Harish Rao | అన్నీ ఫాల్తు కేసులే..
ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని హరీశ్ రావు విమర్శించారు. కౌశిక్ రెడ్డిని (Koushik Reddy) ఫాల్తు కేసు పెట్టి అరెస్ట్ చేశారన్నారు. ఈ కార్ రేస్(E Car Race)తో రాష్ట్రం ప్రతిష్ట పెంచితే కేటీఆర్కు నోటీసులు ఇచ్చారని గుర్తు చేసిన హరీశ్ రావు.. మరి నీకు అందాల పోటీలు ఎవరు పెట్టమన్నారని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్న ఆ ఇద్దరు నాయకులు ఆ అమ్మాయిలను ఇబ్బంది పెట్టారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ (BRS), కేసీఆర్(KCR)ని తలవకుండా మాట్లాడలేడని, ఆయనకు నిద్రలో కూడా కేసీఆర్ గుర్తుకు వస్తున్నారన్నారు. బీజేపీ గురించి మాత్రం సీఎం రేవంత్ ఏమి మాట్లాడడని తెలిపారు. సీఎం రేవంత్కు పాలన చేత కావడం లేదని, మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే అని రేవంత్కు తెలిసిందన్నారు. దీంతో ఏం చేయాలో ఆయనకు అర్థమైతలేదన్నారు. ‘రైతు భరోసా (Rythu Bharosa) కోసం ఔటర్ రింగ్ రోడ్డు ముట్టడి చేద్దాం.. లేదంటే కలెక్టరేట్ ముట్టడిద్దామని’ రైతులకు పిలుపునిచ్చారు.