అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Mla Bhupathi Reddy | గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం పేరుతో రాష్ట్రాన్ని దోచేసిందని రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ భవన్(Congress Bhavan)లో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
కేసీఆర్ను ఘోష్ కమిషన్(Ghosh Commission) విచారణ కోసం పిలవడంతో ఆయనలో అసహనం కనిపిస్తోందన్నారు. పెండింగ్ ప్రాజెక్ట్ల వివరాలు తెలుసుకునేందుకు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం సబ్ కమిటీ వేసిందని పేర్కొన్నారు. కాళేశ్వరంపై (Kaleshwaram) కాదనే విషయాన్ని బీఆర్ఎస్ నాయకులు గ్రహించాలన్నారు. ఆ ప్రాజెక్ట్ అవినీతిలో మామా అల్లుళ్లు అడ్డంగా దొరికిపోయారని అని అన్నారు. మరోవైపు కుటుంబ కలహాలతో అసహనానికి గురవుతున్న బీఆర్ఎస్ అగ్రనేతలు సీఎంపై పనికిమాలిన ఆరోపణలు చేస్తున్నారని సూచించారు.
Mla Bhupathi Reddy | విమర్శలు మానకపోతే భౌతికదాడులే..
ఇప్పటికైనా బీఆర్ఎస్ నాయకులు పేలవమైన ఆరోపణలు మానకపోతే భౌతికదాడులకు సైతం తెగబడతామని ఆయన హెచ్చరించారు. దేశంలో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఉండడం చూసిన బీఆర్ఎస్ నాయకులకు నిద్రపట్టట్లేదని పేర్కొన్నారు. మంత్రివర్గ విస్తరణలో జిల్లాకు అన్యాయం జరిగిందనే విషయాన్ని అధిష్టానానికి విన్నవించడం జరిగిందని స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.