అక్షరటుడే, వెబ్డెస్క్ : Local Body Elections | ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (AP CM Chandrabau) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇద్దరు కంటే తక్కువ పిల్లలుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో (Local Elections) పోటీకి అనర్హులని ఆయన ప్రకటించారు. కూటమి ప్రభుత్వం (Kootami Govt) ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం అమరావతి (Amaravati)లో నిర్వహించిన సుపరిపాలనలో భాగంగా తొలి అడుగు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
యూపీ, బీహార్లో జనాభా బాగా పెరుగుతోందని చంద్రబాబు నాయడు పేర్కొన్నారు. మిగతా రాష్ట్రాల్లో జనాభా పెరగడం లేదన్నారు. పిల్లలు భారం కాకూడదని, వారిని ఆస్తిగా పరిగణించాలని ఆయన సూచించారు. అందుకోసమే తమ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోందని తెలిపారు.
Local Body Elections | ఆ నిబంధన తొలగింపు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జనాభా నియంత్రణ కోసం ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు ఉంటే స్థానిక ఎన్నికల్లో పోటీకి అనర్హులు అనే నిబంధన తీసుకొచ్చారు. ఉమ్మడి ఏపీతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా నియంత్రణను పకడ్బందీగా అమలు చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ నియోజకవర్గాల డీలిమిటేషన్ చేపడితే తమకు అన్యాయం జరుగుతుందని దక్షిణాది రాష్ట్రాలు అంటున్నాయి. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం ఎక్కువ మంది పిల్లలను కనాలని ప్రజలను ప్రోత్సహిస్తోంది. ఇప్పటికే ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే స్థానిక సంస్థల్లో పోటీకీ అనర్హులు అనే నిబంధనను ఏపీ ప్రభుత్వం తొలగించింది. తక్కువ మంది పిల్లలుంటే పోటీకి అనర్హులని ప్రకటించడం తీవ్ర చర్చకు దారి తీసింది.
కాగా.. ప్రస్తుతం పెరిగిన ఖర్చులతో చాలా మంది దంపతులు ఇద్దరు పిల్లలతోనే ఆపేస్తున్నారు. కొంత మంది అయితే ఒకరితోనే సరిపెట్టుకుంటున్నారు. వారిని పెంచి పెద్ద చేయడమే ప్రస్తుత రోజుల్లో కష్టంగా మారిందని తల్లిదండ్రులు చెబుతున్నారు. విద్యా, వైద్యం ఖరీదైన ప్రస్తుత రోజుల్లో ఎక్కువ మంది పిల్లలను కని ఎలా పోషించగలమని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.