అక్షరటుడే, కామారెడ్డి: Yellareddy Congress | ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. పార్టీ సభ్యత్వానికి సదాశివనగర్ గాయత్రి షుగర్స్ షుగర్ కేన్ డెవలప్మెంట్ కౌన్సిల్(సీడీసీ) ఛైర్మన్ ఇర్షాదొద్దీన్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశాడు. ఈ మేరకు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Kumar Goud), డీసీసీ (Kamareddy DCC) అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్ రావుకు లేఖ రాశారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు (MLA Madan Mohan Rao) పీఏల పెత్తనం, వారు ప్రవర్తించే తీరుతోనే రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నాడు. గత బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా ఎమ్మెల్యేగా మదన్ మోహన్ రావు గెలుపు కోసం కష్టపడ్డానని తెలిపాడు.
Yellareddy Congress | అడుగడుగునా అవమానమే..
కొంతకాలంగా పార్టీకి పూర్తి విధేయులైన వారిని అడుగడుగునా అవమానపరుస్తూ విస్మరిస్తూ, పార్టీద్రోహులకు కీలకబాధ్యతలు అప్పగించడం తనను తీవ్రంగా బాధించిందన్నారు. ఇక్కడ మొత్తం ఎమ్మెల్యే పీఏలు రాజ్యమే నడుస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. సొంత పార్టీ నేత షబ్బీర్ అలీని ఎవరైనా కలిస్తే.. తమ దగ్గరికి రావద్దని అంటున్నారని వాపోయాడు. అంతేకాకుండా తమ వాట్సాప్ గ్రూపులో నుండి ఎవరినీ లెక్కచేయకుండా తొలగిస్తున్నారని పేర్కొన్నాడు.
Yellareddy Congress | ఎల్లారెడ్డి నియోజకవర్గంలో..
ఎల్లారెడ్డి నియోజకవర్గంలో (YellaReddy Constituency) కష్టపడ్డ ఏ నాయకునికి ఎలాంటి గౌరవం లేదని, ఏ కార్యక్రమం జరిగినా మండల ప్రెసిడెంట్లకు గాని వివిధ హోదాలో ఉన్న నాయకులకు గాని ఎలాంటి సమాచారం ఉండదని పేర్కొన్నాడు. వివిధ మండలాల్లో ఉన్న అధికారులకు పీఏలు ఫోన్లు చేసి ఏ నాయకుడు వచ్చినా ఏ కార్యకర్త వచ్చిన తాము చెప్పేవరకు పని చేయవద్దని అధికారులకు చెప్పడం జరిగిందన్నాడు. ప్రతి విషయంలో పీఏలు పెత్తనం చేస్తూ వారి హుకూం ప్రకారమే నాయకులు నడుచుకోవాలని, అన్ని విషయాల్లోనూ పీఏలే ముందు నిలబడుతున్నారని వాపోయాడు.
Yellareddy Congress | ఎమ్మెల్యే మంచివారే కానీ..
ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు చాలా మంచివారని, పీఏలు చేసే వ్యవహారాలు ఆయనకు తెలియదన్నాడు. గత కొన్ని రోజుల నుంచి తాను చాలాసార్లు చెప్పడం జరిగిందని వివరించాడు. పీఏల తీరు వల్లే తాను పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయదలుచుకున్నట్టు పేర్కొన్నాడు. తన రాజీనామాను ఆమోదించాలని ఆయన అధిష్టానాన్ని కోరాడు. ఆత్మగౌరవాన్ని చంపుకుని పార్టీలో కొనసాగలేనని స్పష్టం చేశాడు. శుక్రవారం కామారెడ్డిలో మీడియా సమావేశం నిర్వహించి పూర్తి వివరాలు వెల్లడిస్తానని పేర్కొన్నాడు.