అక్షరటుడే, బోధన్: పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రి సమస్యలకు నిలయంగా మారింది. సుమారు మూడెకరాల స్థలంలో విస్తరించి ఉన్న ఈ ఆస్పత్రికి బోధన్ ప్రజలే కాకుండా పక్కనే ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా రోగులు వస్తుంటారు. రెండేళ్ల క్రితం జిల్లా ఆస్పత్రిగా అప్గ్రేడ్ చేశారు. కాని అభివృద్ధికి నిధులివ్వలేదు. వసతులు కల్పించలేదు. దీంతో ఇక్కడ పనిచేస్తున్న వైద్యులు రోగులను ఇతర ఆస్పత్రులకు రిఫర్ చేయడమే పనిగా పెట్టుకున్నారు.
Bodhan Government Hospital | ఆస్పత్రి తీరిది..
బోధన్ జిల్లాస్పత్రిలో మొత్తంగా 52 మంది వైద్యులు ఉండాల్సి ఉండగా.. కేవలం 18మంది మాత్రమే ఉన్నారు. 120 మంది నర్సింగ్ స్టాఫ్కు 74 మంది మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో వచ్చిన పేషెంట్లకు పూర్తిస్థాయిలో వైద్యం అందించడం గగనంగా మారింది.
Bodhan Government Hospital | గైనిక్ విభాగం ఖాళీ..

ప్రభుత్వ ఆస్పత్రిలోని ప్రసవాలు జరగాలని వైద్యాధికారులు గ్రామస్థాయిలో అవగాహన కల్పిస్తున్నారు. కాని గర్భిణులు జిల్లా ఆస్పత్రికి వస్తే కనీసం నాడిపట్టి చూసేవారే కరువయ్యారు. గైనికాలజిస్ట్ లేక గర్భిణుల అవస్థలు అన్నీఇన్నీకావు. దీంతో పేదలు వ్యయప్రయాసలకోర్చి ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఆస్పత్రిలో డెలివరీల శాతం పూర్తిగా పడిపోయింది. ఆస్పత్రిలో కీలక పోస్ట్ అయిన ఆర్థోపెడిక్ విభాగం సైతం ఖాళీగా ఉంది. రోడ్డు ప్రమాద బాధితులు ఆస్పత్రికి వస్తే కేవలం ప్రథమ చికిత్స చేసి పంపిస్తున్నారు.
రిస్క్లేని కేసులు మాత్రమే చూస్తున్నాం
– రాహుల్, ఆస్పత్రి సూపరింటెండెంట్, బోధన్
ఆస్పత్రిలో రిస్క్ లేని కేసులను మాత్రమే అడ్మిట్ చేసుకుంటున్నాం. ప్రధానం గైనకాలజిస్ట్, ఆర్థోపెడిక్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గుండె వైద్యనిపుణుడు కూడా లేకపోవడం ఇబ్బందిగా మారింది. అందుకే పేషెంట్ల ఆరోగ్య దృష్టా నిజామాబాద్ జీజీహెచ్కు రిఫర్ చేయాల్సి వస్తోంది. ఆశావర్కర్లకు సైతం నార్మల్ డెలివరీ కేసులు మాత్రమే తీసుకురావాలని చెప్పాం.