అక్షరటుడే, వెబ్డెస్క్ : Rajat Patidar | ఐపీఎల్ 2022 మెగా వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) తనను మోసం చేసిందని ఆ జట్టు కెప్టెన్ రజత్ పటిదార్(Rajat Patidar) అన్నాడు. వేలంలో కొనుగోలు చేస్తామని చెప్పి పట్టించుకోలేదని తెలిపాడు. ఆ సమయంలో ఆర్సీబీ ఫ్రాంచైజీపై చాలా కోపం వచ్చిందని గుర్తు చేసుకున్నాడు. అదే సీజన్లో లవ్నిత్ సిసోడియా(Lovenit Sisodia) గాయపడటంతో రీప్లేస్మెంట్గా జట్టులోకి వచ్చిన రజత్ పటిదార్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. ఆ ప్రదర్శనతో జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడంతో పాటు ఆర్సీబీ కెప్టెన్సీ(RCB captaincy) బాధ్యతలు అందుకున్నాడు.
తాజాగా ప్రముఖ క్రికెట్ హోస్ట్ మయంతి లాంగర్తో జరిగిన పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో రజత్ పటిదార్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. రీప్లేస్మెంట్(Replacement) ఆటగాడిగా జట్టులోకి రావడం తనకు ఇష్టం లేదని, బ్యాకప్ ప్లేయర్గా బెంచ్పై కూర్చోవడం తనకు నచ్చదని చెప్పాడు. ‘మెగా వేలంలో ఆర్సీబీ(RCB) నన్ను కొనుగోలు చేయలేదు. నన్ను తీసుకుంటామని ముందుగా చెప్పినా తీసుకోలేదు. దాంతో నాకు చాలా కోపం వచ్చింది. ఆ తర్వాత లవ్నిత్ సిసోడియా గాయపడటంతో నన్ను రీప్లేస్మెంట్గా తీసుకున్నారు. వాస్తవానికి రీప్లేస్మెంట్గా రావడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే అక్కడ నాకు ఆడే అవకాశం రాదని తెలుసు. బ్యాకప్ ప్లేయర్గా డగౌట్లో కూర్చోవడం నాకు ఎప్పుడూ ఇష్టం ఉండదు’ అని రజత్ పటిదార్ చెప్పుకొచ్చాడు.
ఆర్సీబీకి ఒక్క ఐపీఎల్ ట్రోఫీ(IPL Trophy) లేదని, ఈ సారి గెలుస్తారా? అన్న ప్రశ్నకు రజత్ పటిదార్ ఘాటుగా స్పందించాడు. తమ మహిళల జట్టు ఒక టైటిల్ గెలిచిందని, ఆర్సీబీకి ట్రోఫీ లేదని ఎవరూ అనలేరని బదులిచ్చాడు. మహిళల టీమ్ స్ఫూర్తితో త్వరలోనే పురుషుల జట్టు కూడా టైటిల్ అందుకుంటుందని ధీమా వ్యక్తం చేశాడు. విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్ కారణంగానే తాను ఐపీఎల్(IPL) చూడటం మొదలుపెట్టానని చెప్పిన రజత్ పటిదార్.. జీవితంలో ఒక్కసారైనా ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహించాలని అనుకునేవాడినని చెప్పుకొచ్చాడు.