అక్షరటుడే, వెబ్డెస్క్:IPL 2025 | ఐపీఎల్ 2025 సీజన్లో విధ్వంసకర శతకంతో వరల్డ్ రికార్డ్ (World Record) నమోదు చేసిన వైభవ్ సూర్యవంశీపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఫ్యూచర్ ఆఫ్ ఇండియా (Future Of India) అంటూ మాజీ క్రికెటర్లు, అభిమానులు కొనియాడుతున్నారు. ఇక ఈ 14 ఏళ్ల కుర్రాడి ప్రతిభ గుర్తించి జట్టులోకి తీసుకోవడమే కాకుండా.. తుది జట్టులో అవకాశం ఇచ్చిన రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్(Rahul Dravid)ను కూడా నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.
టీమిండియాకు ప్రతిభ కలిగిన కుర్రాళ్లను అందించడంలో రాహుల్ ద్రవిడ్కు తిరుగులేదని ప్రశంసిస్తున్నారు. కానీ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) ప్రతిభను ముందుగా గుర్తించి ప్రోత్సహించిందని భారత మాజీ క్రికెటర్, తెలుగు తేజం వీవీఎస్ లక్ష్మణ్(VVS Laxman) అని అతని కోచ్ మనోజ్ ఓజా స్టార్ స్పోర్ట్స్తో మాట్లాడుతూ తెలిపారు.
బీసీసీఐ అండర్ 19 ఛాలెంజర్స్ టోర్నీలో విఫలమైన వైభవ్ సూర్యవంశీకి వీవీఎస్ లక్ష్మణ్ అండగా నిలిచాడని ఆయన వెల్లడించారు. ‘బీసీసీఐ ఛాలెంజర్స్ టోర్నీ(BCCI Challengers Tournament)లోని ఒక మ్యాచ్లో వైభవ్ 36 పరుగుల వద్ద రనౌటయ్యాడు. ఆ తర్వాత అతను డ్రెస్సింగ్లో కంట తడి పెట్టుకున్నాడు. మళ్లీ అవకాశం రాదని చాలా బాధపడ్డాడు. వైభవ్ ఏడ్వడం గమనించిన లక్ష్మణ్.. అతన్ని ఓదార్చాడు. ‘ఇక్కడ మేం పరుగులు మాత్రమే చూడం. సుదీర్ఘ కాలం ఆడే ప్రతిభ ఎవరిలో ఉంది? అనేది గుర్తిస్తాం.’ అని చెప్పాడు. ఆ తర్వాత వైభవ్ గురించి బీసీసీఐ(BCCI)తో పాటు అప్పటి టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్కు తెలియజేశాడు.’ అని మనోజ్ ఓజా చెప్పుకొచ్చారు.
వైభవ్ సూర్యవంశీ(38 బంతుల్లో 7 ఫోర్లు, 11 సిక్సర్లతో 101) విధ్వంసకర శతకంతో 210 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) 25 బంతులు మిగిలి ఉండగానే చేధించి 8 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ (Gujrath Titans)ను ఓడించింది. ఈ సీజన్లో 5 వరుస పరాజయాల తర్వాత విజయాన్నందుకుంది.