అక్షరటుడే, కామారెడ్డి : Kamareddy | రైల్వే గేటు (Railway Gate) వద్ద ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. రైలు వచ్చే సమయంలో ఆ మార్గంలో వాహనాల రాకపోకలను నియంత్రించడానికి గేటు వేస్తారు. అయితే కొందరు వాహనదారులు గేటు పడేలోపు వెళ్దామని ప్రయత్నిస్తారు. ఈ క్రమంలో గేటు పడిపోవడంతో ట్రాక్పై చిక్కుకుపోతారు. ఇలాంటి ఘటనలు గతంలో అనేకం చోటు చేసుకున్నాయి. అయితే తాజాగా కామారెడ్డి (Kamareddy)లో ఓ కారు రైల్వే ట్రాక్ మధ్యలో ఉండగా గేటు పడిపోయింది.
Kamareddy | సిగ్నల్ వ్యవస్థ మారడంతో..
గతంలో గేట్మన్ చేతితో తిప్పుతూ రైల్వే గేటు వేసేవారు. అయితే ప్రస్తుతం ఎలక్ట్రానిక్ సిగ్నలింగ్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. దీంతో బటన్ నొక్కగానే గేట్లు పడిపోతాయి. తర్వాత రైలు వెళ్లాక కానీ వాటిని ఎత్తే అవకాశం లేదు. రైలు గేట్ను దాటిన తర్వాత సిగ్నల్ వస్తుంది. అది వచ్చాకే గేట్లు ఓపెన్ అవుతాయి. అయితే కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ రైల్వే గేటు (Ashok Nagar Railway Gate) వద్ద సోమవారం ఓ కారు రైల్వేట్రాక్ మధ్యలోకి చేరుకోగానే గేట్లు పడిపోయాయి.
గేట్మన్ కూడా వాటిని ఎత్తే అవకాశం లేకపోవడంతో కారులో ఉన్న వ్యక్తితో పాటు అక్కడ ఉన్న వారు ఆందోళన చెందారు. అయితే రైల్వే సిబ్బంది సకాలంలో స్పందించి అధికారులకు సమాచారం అందించారు. దీంతో నిజామాబాద్ (Nizamabad) నుంచి వస్తున్న ముంబై ఎక్స్ప్రెస్ రైలును అత్యవసరంగా ఆపేశారు. అనంతరం గేట్లు ఓపెన్ చేసి కారును ట్రాక్ పైనుంచి పంపించారు. దీంతో కారులో ఉన్న వ్యక్తితో పాటు వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. రైల్వే సిబ్బంది సమయస్ఫూర్తితో ప్రమాదం తప్పింది.