అక్షరటుడే, కామారెడ్డి: DGP Jitender | ప్రజల్లో భద్రతాభావాన్ని పెంపొందించడమే పోలీసుల ప్రధాన లక్ష్యమని రాష్ట్ర డీజీపీ జితేందర్ అన్నారు. గురువారం ఆయన కామారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయాన్ని (Kamareddy District Police Office) సందర్శించి సమీక్ష నిర్వహించారు.
ఎస్పీ కార్యాలయానికి వచ్చిన డీజీపీ, మల్టీ జోన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి (Multi Zone IG Chandrasekhar Reddy), నిజామాబాద్ సీపీ సాయి చైతన్య (Nizamabad CP Sai Chaitanya), ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) పుష్పగుచ్ఛం ఇచ్చి స్వాగతించారు. అనంతరం కార్యాలయ ఆవరణలో డీజీపీ మొక్క నాటారు. మీటింగ్ హాలులో పోలీస్ అధికారులతో సమీక్ష చేపట్టారు. జిల్లాలో శాంతి భద్రతల నిర్వహణ, ప్రాధాన్యమైన కేసుల నేరాల పరిశీలన, ప్రజలకు అందించిన సేవలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎస్పీ వివరించారు.
DGP Jitender | ప్రజల అభిప్రాయాలకు విలువనివ్వాలి
అనంతరం డీజీపీ మాట్లాడుతూ.. తాము సురక్షితంగా ఉన్నామన్న భావన కలిగేలా పోలీసింగ్ జరగాలన్నారు. ప్రజల అభిప్రాయాలకు విలువనిచ్చి సమస్యల పరిష్కారంలో చురుకుగా వ్యవహరించాలన్నారు. ప్రతి కేసులో సమర్థమంతమైన, నిష్పక్షపాత దర్యాప్తు జరిపి బాధితులకు న్యాయం చేయాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు హైవే అథారిటీ (Highway Authority), రవాణా శాఖ సమన్వయంతో తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారు. ప్రాపర్టీ నేరాలకు పాల్పడుతున్న వారిపై గట్టి నిఘా పెట్టాలని సూచించారు. ఈ సమీక్షలో కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, సీపీ కామారెడ్డి సబ్ డివిజన్ ఏఎస్పీ చైతన్య రెడ్డి, అదనపు ఎస్పీ నరసింహారెడ్డి, డీఎస్పీలు శ్రీనివాస్ రావు, విఠల్ రెడ్డి, యాకూబ్ రెడ్డి, ఎస్పీ ఇన్స్పెక్టర్, సీఐలు, ఆర్ఐలు, ఎస్సైలు, ఆర్ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.