అక్షరటుడే, ఇందూరు: ZPHS Borgaon | నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా బోర్గాం(పి) జిల్లా పరిషత్ పాఠశాల (Borgaon (P) Zilla Parishad School) ఉపాధ్యాయ బృందం కృషి చేస్తోందని పాఠశాల హెచ్ఎం శంకర్ అన్నారు. పాఠశాలలో విద్యార్థులకు పుస్తకాలు, ఏకరూప దుస్తులను గురువారం పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ ఏడాది స్కూల్ ప్రారంభం కాకముందే 240 మంది విద్యార్థులు స్కూల్లో అడ్మిషన్ల కోసం పేర్లు నమోదు చేసుకున్నారని తెలిపారు. పాఠశాల ప్రారంభమైన నెలరోజుల్లోనే అడ్మిషన్లు ముగుస్తాయని పేర్కొన్నారు.
గతేడాది తమ పాఠశాలలో 920 మంది విద్యార్థులు విద్యనభ్యసించారన్నారు. అలాగే 194 మంది విద్యార్థులు ఎస్సెస్సీ పాసయ్యారని వివరించారు. పాఠశాలలో సకల సౌకర్యాలు ఉన్నాయని స్పష్టం చేశారు. పాఠశాలలో గ్రామ పెద్దలు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో పుస్తకాలను అందజేశారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.