అక్షరటుడే ఇందూరు: TUCI | కేంద్ర ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్ కంపెనీలకు దారపోస్తోందని టీయూసీఐ జాతీయ అధ్యక్షుడు అమ్రిష్ పటేల్ ఆరోపించారు. టీయూసీఐ రాష్ట్ర మహాసభల సందర్భంగా శనివారం రాజీవ్ గాంధీ ఆడిటోరియం (Rajiv Gandhi Auditorium) నుంచి పాత కలెక్టరేట్ మైదానం వరకు కార్మికులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించి నిరుద్యోగాన్ని పెంచుతున్నారన్నారు. విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, రైల్వే స్టేషన్లు అన్ని ప్రైవేటు కంపెనీల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయని పేర్కొన్నారు. అందుకే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.
TUCI | కార్మిక వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాలి
ప్రధాని మోదీ విధానాలు గత ప్రభుత్వాల కంటే ప్రజా వ్యతిరేకంగా కొనసాగుతున్నాయని అమ్రిష్ పటేల్ మండిపడ్డారు. అందులో భాగంగానే కార్మిక వ్యతిరేక చట్టాలను (Anti labor laws) తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. కార్మిక హక్కులను కాలరాసే నాలుగు లేబర్ కోడ్ లను, పని గంటల పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కృష్ణ, సూర్యం మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు సుప్రీంకోర్టు (Supreme Court) తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీయూసీఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు నరేందర్, పద్మ, హనుమేష్, సహాయ కార్యదర్శి రాజన్న, రామయ్య, వెంకటేశ్, జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్, రాష్ట్ర నాయకులు వెంకన్న, రాజేశ్, ముత్తన్న, మల్లేశ్, యాకోబు షావలి, తదితరులు పాల్గొన్నారు.
