అక్షరటుడే, వెబ్డెస్క్ : Rajasthan | రాజస్థాన్ (Rajasthan)లో రూ.135 కోట్ల వ్యయంతో నిర్మించిన ఫ్లై ఓవర్ ఒక్క వర్షానికి కుంగిపోయింది. ఏళ్ల పాటు మన్నికగా ఉండాల్సిన ఫ్లై ఓవర్ ఒక్క వర్షానికి కుంగిపోవడంతో అధికారులు దానిని మూసివేశారు.
రాజస్థాన్లోని అజ్మీర్లో ఇటీవల ఫ్లై ఓవర్ నిర్మించారు. రూ.135 కోట్లతో నిర్మించిన ఈ వంతెనకు ప్రభుత్వం రామసేతు (Rama Setu) అని పేరు పెట్టింది. అయితే ఈ నెల 2న అజ్మీర్లో భారీ వర్షం కురిసింది. వర్షం ధాటికి ఫ్లైఓవర్ కుంగిపోయింది. దీంతో అధికారులు దానిని మూసేశారు. ప్రస్తుతం మరమ్మతులు చేపడుతున్నారు. అయితే అన్ని కోట్లు పెట్టి నిర్మించిన ఫ్లైఓవర్ మూణ్నాళ్లకే కుంగడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Rajasthan | ప్రభుత్వం సీరియస్
అజ్మీర్ స్మార్ట్ సిటీ (Ajmir Smart City) యోజనలో నిర్మించిన రామసేతు కుంగడంపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ మేరకు విచారణ కోసం ప్రభుత్వం ఓ కమిటీని వేసింది. ఈ కమిటీ ఆదివారం ఫ్లై ఓవర్ను తనిఖీ చేయనుంది. సోమవారం ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది.
Rajasthan | నీట మునగడంతో..
రాజస్థాన్లో జూలై 2న కురిసిన భారీ వర్షం తర్వాత, రామసేతులోని సోనిజీకి నాసియన్ ముందు రోడ్డు మునిగిపోవడంతో పెద్ద గొయ్యి ఏర్పడింది. అయితే రోడ్డు పనులు సక్రమంగా చేపట్టకపోవడంతోనే ఈ గొయ్యి ఏర్పడినట్లు అధికారులు గుర్తించారు.
వంతెన తారు రోడ్డు నమూనాలను కూడా పరిశీలన కోసం సేకరించారు. ప్రస్తుతం నిర్మాణ సంస్థ RSRDC ప్యాచ్ వర్క్ చేయడం ద్వారా గుంతలను తాత్కాలికంగా పూడ్చింది. అయితే ఈ మరమ్మతులు సరిపోవని అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలో కమిటీ నివేదిక అనంతరం చర్యలు చేపట్టనున్నారు.