అక్షరటుడే, లింగంపేట: Kamareddy | ఇంట్లో ఆడుకుంటూ ఓ బాలుడు కాయిన్ మింగేశాడు.. తీరా ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడడంతో గమనించిన తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే బాలుడిని తీసుకుని ఆస్పత్రికి పరుగులు తీశారు.
ఈ ఘటన కామారెడ్డి (Kamareddy) జిల్లా లింగంపేట మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. లింగంపేట (Lingampet) మండలం లింగంపల్లి కుర్దుకు చెందిన బందెల రాజు, సంతోష దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వీరిలో పెద్దకుమారుడైన రెండేళ్ల తన్వీర్ ఇంట్లో ఆడుకుంటుండగా.. రెండు రూపాయల కాయిన్ మింగేశాడు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే లింగంపేట్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఎక్స్రే తీయగా కాయిన్ మధ్యలో ఇరుక్కుందని చెప్పారు. వెంటనే కామారెడ్డి ఈఎన్టీ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించడంతో.. కుటుంబ సభ్యులు బాలుడిని కామారెడ్డిలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ఈఎన్టీ వైద్యులు ఆధునిక పరికరాలతో బాలుడి గొంతులో ఇరుక్కున్న కాయిన్ తొలగించడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.
Kamareddy | కనిపెట్టకపోతే కష్టాలే..
పిల్లలను ఎప్పుడు ఓ కంట కనిపెడుతూ ఉండాలి. లేదంటే కష్టాలు తప్పవు. వారు ఆడుకుంటూ అప్పడప్పుడు ప్రమాదాలను కొని తెచ్చుకుంటారు. దీంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతారు. అందుకే చిన్నారులను కనిపెడుతూ ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. వారికి గోళీలు, కాయిన్స్ ఇవ్వొద్దని చెబుతున్నారు. విద్యుత్, గ్యాస్, వాహనాల దగ్గరకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.